న్యూస్రీల్
సొంత ప్రభుత్వంపైనే నమ్మకం లేదా?
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో అపహాస్యం పాలవుతోందో చెప్పడానికి పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే సజీవ సాక్ష్యం. ఏకంగా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే, తన సొంత ప్రభుత్వ అధికారులపై బహిరంగ సవాళ్లకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికారులు ఒక మాట, ఎమ్మెల్యే ఇంకో మాట చెబుతూ.. ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారు. వెంకంపేట స్థల వివాదంలో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అసలేం జరిగిందంటే..?
పార్వతీపురం పరిధిలోని వెంకంపేటలో ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ నిర్మాణాల వల్ల ఎగువన ఉన్న 500 ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేశారు. అయితే, ఈ వివాదంపై జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో, రిజిస్ట్రార్ ఇప్పటికే పూర్తి క్లారిటీ ఇచ్చారు. సదరు స్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని, అందులో ఎలాంటి అక్రమాలు లేవని అధికారికంగా ప్రకటించారు.
వర్సెస్
తన ప్రభుత్వమే నియమించిన కలెక్టర్, అధికారుల పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేకే నమ్మకం లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు మారలేదు. అధికారుల వివరణను బేఖాతరు చేస్తూ..నేరుగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో తదితరులకు ఎమ్మెల్యే ఆదివారం సామాజిక మాధ్యమాల్లో బహిరంగ సవాల్ విసిరారు. టెక్నికల్గా నిరూపిస్తే.. బహిరంగంగా నా చెంపలు వేసుకోవడానికి సిద్ధం‘ అంటూ సవాళ్లు విసరడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా.. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టను బజారున పడేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కలెక్టర్కు అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్
ముక్కున వేలేసుకుంటున్న స్థానిక ప్రజానీకం
సొంత అధికారుల పైనే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కన్నెర్ర
తేల్చుకుందామంటూ సవాల్


