తెర ముందొకటి..వెనుక ఇంకొకటి! రోజుకొకలా ప్రభుత్వ యంత్రాంగంపై దాడి చేస్తున్న ఎమ్మెల్యే విజయ్చంద్ర అధికారులతో తాడోపేడో వెంకంపేట స్థల వివాదంలో ఎమ్మెల్యే అనుచరుని పాత్ర ఇదే స్థలాన్ని రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని చిర్రుబుర్రు
సాక్షి, పార్వతీపురం మన్యం :
ప్రశ్నించే గొంతు ఎప్పుడూ ఆగదని చెబుతు న్న పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్చంద్ర.. ప్రభు త్వ వ్యవస్థలోని లోపాలను రోజుకొకలా బయటపెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. తమ ప్రభుత్వంలో భాగమైన అధికార యంత్రాంగాన్నే లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. మొన్న రెవెన్యూ అధికారులు.. ఆ తర్వాత కలెక్టరు, జేసీ, సబ్ కలెక్టరు.. నిన్న విద్యా శాఖ.. నేడు సబ్ రిజిస్ట్రార్.. ఇలా ఒక్కొక్కరిపైనా చిందులు తొక్కుతున్నారు. దీని వెనుక అంతిమ లక్ష్యం కలెక్టరు ప్రభాకరరెడ్డి. ఎమ్మెల్యే భాషలో చెప్పాలంటే.. ‘చిత్తూరు రెడ్డి’! ప్రశ్నించే గొంతు కంటే.. ఫ్రస్టేషన్నే ఆయనలో ఎక్కువగా కనిపిస్తోందని నలువైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మన దారికొస్తే.. అంతా రైట్! లేకుంటే రాంగ్!! అన్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర వ్యవహార శైలి ఉంది. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు సాగిపోతున్నా యి. అక్రమ వ్యవహారాలు, ఇసుక దందాలు విపరీతంగా సాగుతున్నాయి. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్నది బహిరంగంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి పనికీ ఓ రేటు కట్టేసి, కమీషన్లతో దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు వంటి పోస్టులను అమ్మేసుకుంటున్నారని, ఈ వ్యవహారంలో, నియోజకవర్గ నేత ధన దాహానికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా బలైపోతున్నార ని సొంత పార్టీలోనే విమర్శలు లేకపోలేదు. తాము చెప్పిన పని చేయకపోయినా, చెప్పిన వారిపై వేటు వేయకపోయినా అధికారుల మీద కస్సుబుస్సుమంటున్నారు. పార్టీ శ్రేణులను రెచ్చ గొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో చాలావరకు ఆక్రమణలున్నా.. కొన్నింటిపైనే యుద్ధం ప్రకటిస్తున్నారు. దీని వెనుక కూడా అడిగినంత కమీషన్ ఇవ్వకపోవడ మే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నందుకు, తమకు అనుకూలంగా భూములను ఆన్లైన్లో మార్చలేనందుకు రెవెన్యూ అధికారులపై చిందులు తొక్కారు. తాము అడిగిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం లేదని కలెక్టరు, జేసీలనే టార్గెట్ చేశారు. బలిజిపే ట మండలం పెదపెంకిలో పనుల వివాదం ఇందుకు ఉదాహరణ. విద్యా శాఖలో తాము చెప్పిన వారికి పోస్టులు వేయలేదని, ఓ కాంట్రాక్టు విషయమై అడిగినంత కమీషన్ ఇవ్వలేదని ఆ శాఖ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తాజాగా పార్వతీపురంలోని వెంకంపేట పంచా యతీ పరిధిలోని సర్వే నంబరు 127లో ఇరిగేషన్ ప్రాంతంగా చెబుతున్న ఓ స్థలం రిజిస్ట్రేషన్ వ్యవహారంపై ఎమ్మెల్యే విజయ్చంద్ర మీడియా సమావేశం పెట్టి మరీ, నిప్పులు చెరిగారు. మీడి యా ముందే జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లకు ఫోన్ చేసి.. వారి మనోభావాలకు, విధులకు భంగం కలిగించేలా వ్యవహరించారు. విద్యాశాఖలో అవినీతి విషయంలోనూ, వెంకంపేట స్థల రిజి స్ట్రేషన్ విషయంలోనూ కలెక్టర్ ప్రభాకరరెడ్డిని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపా రు. వాస్తవానికి ఈ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున ముడుపులు రిజిస్ట్రేషన్ చేసుకున్న గ్రంథి వాసు కుటుంబం అందించిన ట్లు సమాచారం. దీంతోపాటు, ఎమ్మెల్యే సొంత ఇంటి నిర్మాణానికి రూ.లక్షలు విలువ చేసే సిమెంట్, ఐరన్ ఉచితంగా అందించారని తెలుస్తోంది. అప్పటికీ ఎమ్మెల్యే వేధింపులు ఆపకపోవడం వల్లే న్యాయం కోసం కొద్ది రోజులుగా కలెక్టరు చుట్టూ తిరిగామని వారు చెబుతున్నారు. తన మాటను కాదని స్థలాన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడంతో ఎమ్మె ల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీడియా సమావేశం పెట్టి మరీ, అధికారులపై చిందులు వేశారు. ఇదే సమయంలో వెంకంపేటలో వివాదానికి కారణమైన స్థలానికి సాక్షి సంతకం పెట్టింది కూడా ఎమ్మెల్యే విజయ్చంద్ర ముఖ్య అనుచరుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు జి.క్రాంతికుమార్ కావడం గమనార్హం. ఇక్కడే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వంద్వ వైఖరి బయటపడిందని అధికారులు చెబుతున్నారు.


