
కొత్తవలస కేజీబీవీలో అగ్నిప్రమాదం
కొత్తవలస:
మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ శివారు అడ్డూరువానిపాలెం వద్ద గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం తెల్లవారు జూమున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన రోటరీ క్లబ్ సంస్థ వారు బాలికలకు వితరణగా మంగళవారం అందజేసిన 280 పరుపులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 79 మందికి చెందిన అభ్యసన సామగ్రి కాలిబూడిదయ్యా యి. కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన ఇద్దరు బాలికలు ప్రమాదాన్ని గుర్తించి అందరినీ అప్రమత్తం చేశారు. వెంటనే బాలికలందరూ భవనం నుంచి బయటకు పరుగుతీశారు. విద్యాలయం సిబ్బంది అందించిన సమాచారం మేరకు కొత్తవలస, ఎస్.కోట అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పై అంతస్తులో ప్రమాదం కావడంతో మంటలు అదుపుచేయడం కష్టతరమైంది. ఉదయం 7 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. బాలికలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఎస్ఓ విజయకుమారితో పాటు బాలికల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.
విద్యాలయాన్ని సందర్శించిన పీఓ
ప్రమాద వార్త తెలిసిన వెంటనే సర్వశిక్షా అభియాన్ పీఓ డాక్టర్ అవగడ్డ రామారావు విద్యాలయానికి చేరుకున్నారు. ప్రమాదం తీరును ఎస్ఓ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీఈఓ మాణిక్యంనాయుడు సందర్శించి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. కాలిపోయిన అభ్యసన సామగ్రి, ఇతర వస్తువులు కొనుగోలుకు రూ.2లక్షలు మంజూరు చేసినట్లు పీఓ రామారావు తెలిపారు.
సహాయక చర్యలు
ప్రమాద స్థలాన్ని కొత్తవలస మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గొరపల్లి శివ, మేజర్ పంచాయ తీ సర్పంచ్ మచ్ఛ ఎర్రయ్యరామాస్వామి, వైఎస్సార్సీపీ నాయుకులు చెల్లయ్యలు పరిశీలించా రు. పాఠశాలకు 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని పంపించి సహాయక చర్యలు అందించారు.
కాలిబూడిదైన 280 పరుపులు, 79 మంది విద్యార్థుల అభ్యసన సామగ్రి
సురక్షితంగా బయటపడిన
270 మంది బాలికలు
విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం

కొత్తవలస కేజీబీవీలో అగ్నిప్రమాదం