డిజిటలైజేషన్ 23,860ఫారాలు
నరసరావుపేట:ఈనెల14 నుంచి జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 6,32,245 ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశామన్నారు. క్షేత్రస్థాయి నుండి సేకరించిన ఫారాల ఆన్న్లైన్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 23,860 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉన్నారని, వీరి వివరాల సేకరణ మరియు సవరణ కోసం క్షేత్రస్థాయిలో బీఎల్ఓల ద్వారా ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మొత్తం ఓటర్లు 2,33,756 ఉండగా 1.09,530మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసినట్లు అధికారులు తెలియచేశారు. 1041ఫారాలు డిజిటలైజేషన్ చేయటం జరిగిందన్నారు.
నరసరావుపేటటౌన్: చోరీ సొత్తు కలిగి ఉన్నట్లు నేరం నిరూపణ కావడంతో మూడు కేసుల్లో నిందితులకు ఏడాది జైలు, రూ.2వేలు జరిమానా విధిస్తూ స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి ఎం.గాయత్రి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది జనవరి నెలలో నకరికల్లు మండలంలోని వివిధ ప్రాంతాల్లో నిందితులు మోటార్ సైకిళ్లు చోరీ చేసినట్లు మూడు కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న నకరికల్లు పోలీసులు నిందితులు పట్టణంలోని బరంపేటకు చెందిన శిఖా ఉదయ శంకర్, నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మర్రివేముల గోపిలను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం నిరూపణ కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్ష మొత్తాన్ని ఏకకాలంలో అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు.
తండ్రిని హత్య చేసిన తనయుడు
బొల్లాపల్లి: డబ్బులు ఇవ్వలేదని తండ్రిని, కుమారుడు కరత్రో కొట్టడంతో మృతి చెందిన విషయం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య(72)కు ముగ్గురు కుమారులు.మూడో కుమారుడు గజ్జ భద్రయ్య మతిస్థిమితం తక్కువ కావడంతో పెళ్లి కాలేదు. భద్రయ్య, తండ్రితో కలిసి ఉంటున్నాడు. క్రాప్ చేయించుకోవడానికి తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో, ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో కుమారుడు కర్రతో తండ్రి తలపై కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మతిస్థిమితం తక్కువగా ఉన్న మూడో కుమారుడు బాదరయ్య ఏడాది క్రితం కన్నతల్లి సోమమ్మ ను రాడ్డుతో మోదడటంతో అప్పట్లో తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సయ్యద్ సమీర్బాషా తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు అందజేశారు.
ఎకరాకు రూ.కోటి
పరిహారం ఇవ్వాలి
భూములు కోల్పోయే రైతులు డిమాండ్
పెదకూరపాడు: గుంటూరు– బీబీనగర్ రైల్వే లైన్ భూసేకరణ పేరుతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం భూములు కోల్పోతున్న రైతులతో సభ నిర్వహించారు. సభకు తహసీల్దార్ కుంభా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయ పర్యవేక్షకులు పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ పెదకూరపాడులో వ్యవసాయ భూమికి ఎకరాకు రిజిస్ట్రేషన్ విలువ సగటున రూ.13 లక్షలు ఉందన్నారు. ఆ విలువకు 1.25తో హెచ్చిస్తే రూ.16 లక్షల 25 వేలు వస్తుందన్నా రు. దానికి 100 శాతం పెంచితే రూ.32 లక్షల 50 వేలు పరిహారంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనికి అదనంగా నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 12 శాతం వడ్డీ లెక్కించి రైతుల ఖాతాలో దామాషా ప్రకారం జమ చేయడం జరుగుతుందన్నారు. హైవే పక్కన ఉన్న భూములు, ఇళ్ల స్థలాలు ఇల్లు కోల్పోయే వారికి నిర్ధారించిన ధర ప్రకారం ఇస్తారని తెలిపారు. లింగంగుంట్ల, వ్యవసాయ భూమి, చిన్నమక్కె న వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు పరిహారాలపై వివరించారు. పొలాల్లో బావి, చెట్లు ఉంటే వాటికి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇస్తారని తెలిపారు. రైతుల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదేళ్లలో పెరిగే ధరను నిర్ధారించి పరిహారంగా ఇవ్వాలని కోరారు. ఎవరికై నా వ్యక్తిగత సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కే శ్రీనివాసరావు కోరారు. ఇళ్లకు ప్రత్యేక ఇంజినీర్ను కేటాయించి ధర నిర్ధారణ చేస్తారన్నారు. భూమిని బట్టి కనీసం రూ.50 లక్షల నుండి కోటి రూపాయలు పైగా ఇవ్వాలని సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందించారు.


