స్థలాన్ని ఆక్రమించి బెదిరిస్తున్నారు..
నరసరావుపేట రూరల్: భార్యభర్తల వివాదాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ జేవి సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో పాటు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 68 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఆస్తి వివాదాలపై 12, ఆర్ధిక వివాదాలపై 8, భూ వివాదాలపై ఏడు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వచ్చే మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. విచారణను వేగంగా పూర్తిచేసి చట్టప్రకారం న్యాయం చేయాలని సూచించారు.
సాయిబాబా గుడి కోసం తక్కువ ధరకు ఇచ్చిన స్థలాన్ని వేరొకరికి విక్రయించారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అల్లూరివారిపాలెం రోడ్డులో సాయిబాబా గడి నిర్మిస్తామంటే తక్కువ ధరకే 8 సెంట్లు భాస్కరశర్మ, సత్యవతిలకు విక్రయించాం. గుడి నిర్మిస్తేనే స్థలాన్ని అప్పగిస్తానని చెప్పాం. గుడి నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో స్థలం నా ఆధీనంలోనే ఉంది. రిపోర్టర్ సహకారంతో భాస్కరశర్మ, సత్యవతిలు ఆ స్థలంలో మరోవైపు ఫెన్సింగ్ వేశారు. దీనిని ప్రశ్నిస్తే రూ.20లక్షలు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు.
–వేములపాటి వెంకరెడ్డి, లింగంగుంట్ల
జిల్లా పోలీసు కార్యాలయంలో
పీజీఆర్ఎస్
ఫిర్యాదులు స్వీకరించిన
జిల్లా అదనపు ఎస్పీ సంతోష్


