పవన్ పర్యటనతో భక్తులకు అవస్థలు
నరసరావుపేట రూరల్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ పర్యటనతో భక్తులకు, ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తప్పలేదు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కళ్యాణ్ కోటప్పకొండకు చేరుకుని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం నుంచి కొండను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రధాన సెంటర్లోని దుకాణాలను మూసివేయించారు. రోజువారీ వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగించే వ్యాపారులు ఇబ్బందిపడ్డారు. భక్తుల రాకపైనా పోలీసుల ఆంక్షలు విధించారు. ఉదయం నుంచే కొండకు వచ్చే భక్తులను ఆపారు. నరసరావుపేట– కోటప్పకొండ మార్గంలోని ఆర్టీవో కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే ఈ రోడ్డులోకి అనుమతించారు. కోటప్పకొండ చౌరస్తాలోని ధ్యానశివుడు విగ్రహానికి కూటమి నాయకులు ఫ్లెక్సీలు కట్టడంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. పవన్ కళ్యాణ్ను కలిసి వినతులు ఇచ్చేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన మరియమ్మకు రెండు కాళ్లు, చేతులు లేవు. పూర్తి వైకల్యంతో ఉన్న తనకు ప్రస్తుతం వికలాంగ పెన్షన్ మాత్రమే అందుతోంది. దీనిని రూ.15 వేలకు పెంచాలని కోరుతూ పవన్ కళ్యాణ్కు వినతిపత్రం ఇచ్చేందుకు కోటప్పకొండకు వచ్చింది. ప్రధాన సెంటర్లో వేచి ఉన్న ఆమెను పోలీసులు పక్కకు పంపించేశారు.
పవన్ పర్యటనతో భక్తులకు అవస్థలు


