గూండాలు రాజ్యమేలుతున్నారు
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి
తప్పు చేసిన అధికారులకు
శిక్ష తప్పదు
సీఐ భాస్కర్పై కేసు వేస్తాం
కేసు నమోదు చేయకపోతే
పోలీస్స్టేషన్ ముట్టడిస్తాం
టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆకూరి వెంకటరెడ్డికి పరామర్శ
దాచేపల్లి:గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే గా యరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే గూండాలు రాజ్యమేలుతారని ముందు చెప్పామని, ప్రస్తుతం గూండాలు రాజ్యమేలుతున్నా రని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. దాచేపల్లి మండలం రామాపురం ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు దాడిచేయగా తీవ్ర గాయాలతో పిడుగురాళ్లలోని పల్నాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వెంకటరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు బుధవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీ భర్తపై టీడీపీ నాయకులు నడిరోడ్డుపై దాడి చేస్తే బండి మీద నుంచి పడ్డాడని చెప్పటానికి దాచేపల్లి సీఐ పొన్నూరి భాస్కర్కు సిగ్గు ఉండాలని అన్నారు. ఇనుపరాడ్లతో కొట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని, ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కూడా కలసి ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయకపోతే దాచేపల్లి పోలీస్స్టేషన్ను వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో ముట్టడిస్తామని చెప్పారు.
ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పోలీసులపై హైకోర్టులో కేసులు కూడా వేస్తామన్నారు. దాచేపల్లి సీఐ భాస్కర్పై ప్రైవేట్ కంప్లిట్ కూడా కోర్టులో నమోదు చేస్తామని, తప్పు చేసిన వారు ఇంతకు పదింతలు అనుభవించే రోజులు కూడా వస్తాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాం:
రామాపురం ఎంపీటీసీ ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన దాడి ఘటన గురించి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని మాజీ ఎమ్మెల్యే కాసు చెప్పారు. బాధితుడు వెంకటరెడ్డికి అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ సీఎం జగన్ చెప్పారని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, ఎంపీపీ కందుల జాను, వైస్ చైర్మన్లు కొమరబత్తిన విజయ్కుమార్, షేక్ ఖాదర్బాషా, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్ సత్తార్, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, చింతా సుబ్బారెడ్డి, మాదాల కిరణ్, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


