
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
● మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 5న సబ్స్టేషన్ల ఎదుట ధర్నా ● జయప్రదం చేయాలని సీపీఎం నాయకుల పిలుపు
నరసరావుపేట: విద్యుత్ చార్జీలు పెంచినా, స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజా ఉద్యమం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో రైతు సంఘ జిల్లా ప్రధాన ఏపూరి గోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో విజయ్కుమార్ మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్మార్ట్ మీటర్లు అంగీకరించిన వారికి బిగించమని చెప్పారని, అంగీకారాలతో సంబంధం లేకుండా ప్రక్రియ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో సామాన్య ప్రజలపై పెనుభారాలు మోపుతూ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచడంతో ప్రజా తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెకీతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కొనసాగించడాన్ని తప్పుపట్టారు. ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలతో ఈనెల 5న విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద, సచివాలయాల వద్ద జరిగే నిరసన ధర్నాలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఊపందుకున్న నేపథ్యంలో రైతులు వద్ద ఉన్న పొగాకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నాగార్జునసాగర్ ముంపు ప్రాంతాలలో ప్రజలకు పునరావాసం కల్పించాలని కోరారు. తొలకరి వర్షాలకు పత్తి సాగుచేసి తీవ్ర వర్షాబావ పరిస్థితులను నేపథ్యంలో నష్టపోయిన రైతులకు పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇన్పుట్ సబ్సిడీ కింద నగదు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు పాల్గొన్నారు.