
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని ములకలూరు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... సత్తెనపల్లికి చెందిన నాటకం రాకేష్(34), షేక్ జాని(45)లు కుక్కపిల్లను నరసరావుపేటలో వదిలివెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ములకలూరు సమీపంలోని టౌన్షిప్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి ఇరువురు కిందపడిన సమయంలో వెనుక వచ్చిన గుర్తుతెలియని టిప్పర్ వీరిపై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రధాన రహదారిపై ఛిద్రమైన మృతదేహాలు పడిపోవడంతో విషాదకర వాతావరణం కనిపించింది. ఈ ప్రమాదంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలాన్ని రూరల్ ఎస్ఐ కిషోర్ పరిశీలించి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
జెడ్పీ సీఈఓ జ్యోతిబసు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జెడ్పీ సీఈఓ వి. జ్యోతిబసు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు మండలానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి పీఏఐ పోర్టల్పై సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 వెర్షన్ (పీఏఐ పోర్టల్)కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, తెన్నులపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఎం డి. రవీంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు.
యాక్సిడెంట్ ఫొటోలు
వచ్చాయంటూ టోకరా
● బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.5.72 లక్షలు కాజేసిన
సైబర్ నేరగాడు
● ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లో
బాధితుడి ఫిర్యాదు
చీరాల అర్బన్: సైబర్ నేరగాళ్ల పంజాకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరుతున్నారు. వాట్సాప్లో ఫొటోలు వచ్చాయని చూడమంటూ ఓ వ్యక్తికి కాల్ చేయగా.. వాట్సాప్ తెరిచిన వెంటనే రూ.5.72లక్షల నగదును అతని అకౌంట్లో మాయమయ్యాయి. దీంతో బాధితుడు బుధవారం ఈపూరుపాలెం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన పులి హరికృష్ణకు ఈనెల 3 న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి యాక్సిడెంట్ ఫొటోలు వాట్సాప్లో వచ్చాయి చూడమని చెప్పాడు. దీంతో ఏం జరిగిందోనని హరికృష్ణ వాట్సప్లో చూడగా ఫొటోలు కనిపించలేదు. కొద్ది నిమిషాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినట్లుగా మెసేజ్లు వచ్చాయి. విడతల వారీగా 5 లక్షల 72 వేల రూపాయలు డెబిట్ అయ్యాయి. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ కావడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని అకౌంట్ హోల్డ్లో ఉంచడంతో ఒక లక్ష రూపాయలు డెబిట్ కాకుండా ఆపారు. సైబర్ క్రైం పోలీసుల సూచనల మేరకు బుధవారం ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.చంద్రశేఖర్ తెలిపారు.