
వైభవంగా మల్లాది వెంకన్న శాంతి కల్యాణం
అమరావతి: మల్లాది గ్రామంలోని వట వృక్షాంతర్గత వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజల అనంతరం శాంతి కల్యాణం నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, తులసీ మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు తొమ్మిది మంది దంపతులచే శాంతి కళ్యాణ ప్రక్రియను ఆలయ యాజ్ఞీకస్వామి పరుచూరు శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. మధ్యా హ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
పునఃప్రారంభమైన
శ్రీవారి ఊయల సేవ
తెనాలి టౌన్: శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి ఊయల సేవ శనివారం నుంచి పునఃప్రారంభమైనది. ఆలయ కార్యనిర్వహణాధికారులు వి.అనుపమ మాట్లాడుతూ దేవస్థానంలో ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటల కు శ్రీస్వామి అమ్మవార్లకు ఊయల సేవ జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఊయల సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించారు. కొండేపి వసుంధర బృందం ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
రామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక
ఏకాదశ రుద్రాభిషేకం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మల్లారెడ్డినగర్ విఘ్నేశ్వరస్వామి సహిత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. రామలింగేశ్వర స్వామికి ఆలయ అర్చకులు పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, నవగ్రహ, మండప దేవత హోమాలను చేపట్టారు. భక్తులకు తీర్ధ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఫౌండేషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి దంపతులు, అన్నదాన కమిటీ చైర్మన్ గుంటూరు వేమారెడ్డి, కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు.
జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి స్థలాల పరిశీలన
బాపట్ల: జిల్లా కోర్టు భవన సముదాయం బాపట్ల పట్టణంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. తూర్పు బాపట్లలో ఖాళీగా ఉన్న 7.5 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఇందిరానగర్లో ఖాళీగా ఉన్న 2.80 ఎకరాల భూమిని పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భూమి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలను పంపాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట బాపట్ల తహసీల్దార్ సలీమా, సర్వేయర్లు వీఆర్వోలు తదితరులు ఉన్నారు.

వైభవంగా మల్లాది వెంకన్న శాంతి కల్యాణం