
నీట్ ర్యాంకర్ వసీమా అందరికీ స్ఫూర్తిదాయకం
నరసరావుపేట: నీట్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా 80వ ర్యాంకు సాధించిన షేక్ వసీమా అభినందనీయురాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆ పాప సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మండలంలోని చినతురకపాలెం గ్రామంలో షేక్ సాపమహబూబ్ సుభాని, సకిన దంపతుల కుమార్తె వసీమా శనివారం విడుదల చేసిన నీట్ ఎగ్జామ్ ఫలితాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆల్ ఇండియాలో 80వ ర్యాంకు సాధించింది. శనివారం సాయంత్రం వసీమా గ్రామానికి చెందిన తన బంధువు షేక్ సుభానితో కలిసి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని పార్టీ కార్యాలయంలో కలిశారు. గోపిరెడ్డి ఆ విద్యార్థినిని సత్కరించి అభినందించారు. గోపిరెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియాలో 80వ ర్యాంకు రావటం సామాన్యమైన విషయం కాదని అన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ అమలుచేసిన నాలుగు శాతం రిజర్వేషన్ వల్ల ఎంతోమంది మైనార్టీ అమ్మాయిలు, అబ్బాయిలు మంచి ర్యాంకులతో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారన్నారు. వసీమాను అందరూ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వసీమాను మునుముందు పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యను చదివించాలని సూచించారు. వారి కుటుంబంలో ఎనిమిది మంది డాక్టర్లు అంటే సామాన్య విషయం కాదని, ఓకే కుటుంబం ఎనిమిది మంది డాక్టర్లు కావటం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆ గ్రామంలో ఇప్పటికీ 30 మంది డాక్టర్లుగా డిగ్రీలు పొందారని, ఇంకా రెండు మూడు రోజుల్లో నీట్ విశ్లేషణ పూర్తయితే మరో ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు రావడానికి అవకాశం ఉందని అన్నారు. వారందరూ ఎన్నో విజయాలు సాధించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. షేక్ కరిముల్లా, అచ్చి శివకోటి, వై.రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
అభినందించి సత్కరించిన
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి