● యువికా–25కు ఆహ్వానం ● ఈ నెల 23 వరకు రిజిస్ట్రేషన్ గడువు ● తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అవకాశం
సత్తెనపల్లి/బెల్లంకొండ :భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను చూసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అంతరిక్ష పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి కలిగించడమే ప్రధాన ఉద్దేశం. స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఇస్రో యువికాను చేపడుతోంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా తొమ్మిదవ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మేలో రెండు వారాలపాటు శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన కల్పిస్తారు.
శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఇవే..
ఇస్రోను యువికాను దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో నిర్వహిస్తోంది.
● తిరువనంతపురం (కేరళ) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్
● తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్) సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్
● డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
● అహ్మదాబాద్ (గుజరాత్) స్పేస్ అప్లికేషన్
సెంటర్
● షిల్లాంగ్ (మేఘాలయ) నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్
● బెంగళూర్ (కర్ణాటక) యూఆర్ రావు శాటిలైట్ సెంటర్
● హైదరాబాద్ (తెలంగాణ) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
వెయిటేజ్ ఇలా...
● 8వ తరగతిలో పొందిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.
● జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం ఇస్తారు.
● స్పేస్, సైన్స్ క్లబ్లలో నమోదై ఉంటే ఐదు శాతం
● ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఐదు శాతం.
● గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే 20 శాతం ప్రాధాన్యమిస్తారు.
ఎంపికై తే అన్నీ ఉచితం
యువికాకు ఎంపికై న విద్యార్థులకు ప్రయాణంతో పాటు వసతి, భోజన సదుపాయాలను అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉచితంగానే అందిస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో రెండు వారాలపాటు (14 రోజులు) ఇస్రోకు చెందిన వివిధ రాష్ట్రాల్లోని స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, నవగ్రహాల సముదాయం తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం కలుగుతుంది.
విద్యార్థులకు అరుదైన అవకాశం
ఇస్రో కల్పించే అరుదైన అవకాశాన్ని విద్యార్థి దశలోనే పొందితే కచ్చితంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు దీన్ని బాధ్యతగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించాలి.
–ఎస్.రాజశేఖర్,
జిల్లా సైన్స్ అధికారి, పల్నాడు
శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం
ప్రపంచంలోనే అగరాజ్యాలతో పోటీపడుతూ ఇస్రో ఎన్నో విజయవంతమైన రాకెట్ ప్రయోగ పరీక్షలను నిర్వహించింది. దేశ కీర్తిని ఆకాశానికి తీసుకెళ్లింది. యువికా పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం. ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
–ఏ.ఏ. మధు కుమార్,
సైన్స్ ఉపాధ్యాయుడు, ఉప్పలపాడు
ఆన్లైన్ ద్వారా ఎంపిక ప్రక్రియ
యువికాలో భాగంగా 2025లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవి.ఇన్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు పంపించాలి. ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఉంది.
ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితాను విడుదల
మే 18న ఆహ్వానం
మే 19 నుంచి 30 వరకు శిక్షణ
మే 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తారు.
ఇస్రో చూసొద్దాం రారండోయ్ !
ఇస్రో చూసొద్దాం రారండోయ్ !