రాయగడ: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, డైరక్టర్ కరణ్ అదానీ లు ఆదివారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రొఎల్లోయిస్ (ఇంఫా ) సంస్థకు చెందిన ప్రత్యేక హెలీకాప్టర్లో ఇక్కడికి చేరుకున్న పారిశ్రామిక దిగ్గజాలు కలెక్టర్ అశుతొష్ కులకర్ణి, ఎస్పీ రాజ్ ప్రసాద్లతో దాదాపు గంట సమయం వరకు చర్చించారు. అదానీ ఎంటర్ప్రైజెస్, యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ రిసొర్సెస్ హోల్డింగ్ (ఐఆర్హెచ్) సంయుక్తంగా రాష్ట్రంలో సుమారు 1.08 లక్షల కోట్లతో సమగ్ర అల్యూమినియం ఎకొ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో వార్షిక 4 మిలియన్ టన్నుల అల్యూమినియం రిఫైనరీ, 2 మిలియన్ టన్నుల అల్యూమినయి స్మెల్టర్, 1 మిలియన్ టన్నుల డౌన్స్ట్రీమ్ అల్యూమినియం పార్క్, 4 వేల మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, 400 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. రాయగడ, కొరాపుట్ జిల్లాలో ప్రపంచ స్థాయి బాకై ్సట్ నిక్షేపాలు ఉండడంతో రాయగడలోనే సుమారు రూ.41,650 కోట్లతో 4 మిలియన్ టన్నుల సామర్థ్యం గల అల్యూమిన రిఫైనరీ, అనుబంధ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే రాయగడతో పాటు దక్షణ ఒడిశాలో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్ధికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు కొత్త ఊపు లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.


