భువనేశ్వర్: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ స్థితిని సమీక్షించేందుకు విద్యుత్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్) విశాల్ దేవ్ అధ్యక్షతన శని వారం అన్ని డిస్కామ్లతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభావిత జిల్లాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తు గ్రిడ్ను వేగంగా పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమావేశంలో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా 93 శాతం ప్రభావిత వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని డిస్కామ్లు ధ్రువీకరించాయి. చాలా ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కేంద్రాపడ, జగత్సింగ్పూర్ వంటి జిల్లాల్లోని లోతట్టు, జల దిగ్బంధం, నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ప్రాంతాల్లో అడుగిడి పనులు చేపట్టేందుకు అనుకూలించని పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో స్వల్ప జాప్యం జరుగుతోంది. వరద ప్రభావంతో విద్యుత్ మౌలిక సదుపాయాలకు పెద్దగా నిర్మాణపరమైన నష్టం జరగలేదు.
జయపురం: విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని వక్తలు అన్నారు. మెరుగైన సమాజం వారితోనే సాధ్యమని చెప్పారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. బొయిపరిగుడ సాహిద్ లక్ష్మణ నాయిక్ డిగ్రీ కళాశాల జాతీయ సేవా యోజన, యువ రెడ్క్రాస్లు శనివారం సంయుక్తంగా నిషాముక్త భారత్ అభిజాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిషాముక్త భారత్ నిర్మాణంలో యువత భూమిక అనే ఆంశంపై చర్చి్ంచారు. కళాశాల అధ్యాపకులు మౌసిమి మహంతి, మానపీ ఆచార్య, అధ్యాపకులు అంజనీ ఆచార్య, భగవాన్ మఝి, మత్తు పానీయాల వలన కలిగే నష్టాలు, అనర్థాలు, వాటి నివారణకు ప్రజలను చైతన్య పరచేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలు, మత్తు పదార్ధాలకు యువతను దూరంగా ఉంచాల్సిన అవసరాలపై చర్చించారు. నిషా వస్తువులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సమర కుమార్ మహాపాత్రో, క్షీరోద్ కుమార్ పాయిక్, సోను పొరజ, టి.దిల్లీ రాణి చౌదరి, రాజేష్ భుయ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, కళాశాల సిబ్బంది నిషాముక్త భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి హిమాంశు శేఖర బక్షీ, యువ రెడ్ క్రాస్ కౌన్సిలర్ జ్యోతీ పాఢీలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
గేల్ ఇండియా శ్రామికుని అనుమానాస్పద మృతి
రాయగడ: సదరు సమితి పరిధిలొని గుమ్మ పంచాయతీ ప్రాంతంలో గేల్ ఇండియా కంపెనీ పోలార్ ప్యానల్ లయన్ ఫిట్ పనులకు సంబంధించి పనిచేస్తున్న ఒక శ్రామికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ (30) గా పోలీసులు గుర్తించారు. స్థానికులు, పోలీసులు వివరాల ప్రకారం మనోజ్ గత రెండు నెలలుగా గేల్ ఇండియా కంపెనీలో శ్రామికునిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది రొజుల కిందట తన సొంత గ్రామానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే గత మూడు రోజులుగా పనులను ముగించుకుని శ్రామికుల కోసం ఉన్న విశ్రాంతి గదిలో ఉంటుండేవాడని ఏమీ తినకుండా ఉండేవాడని తోటి శ్రామికులు తెలియజేశారు. అయితే శుక్రవారం నాడు మనోజ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మనోజ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారాన్ని మనోజ్ కుటుంబీకులకు తెలియజేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


