రాయగడ: జిల్లాలోని బిసంకటక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా..వారిలో ఇద్దరికి తలకు తీవ్రగాయాలయ్యాయి. పాఠశాల ప్రాంగణంలో నెలకొంటున్న అశాంతి వాతావరణంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన మత్తుపదార్ధాల నిర్మూలన అవగాహన కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం విరామ సమయంలో కొందరు విద్యార్థులు పాఠశాల వెలుపల ఇతర విద్యార్థులపై ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా ఇద్దరికి తలలు పగిలి రక్తస్రావంతో ఉన్న వారిని తోటి విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బిసంకటక్ పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థుల నుంచి వివరాల సేకరించారు. దాడికి పాల్పడిన విద్యార్థులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హేమంత్ కుమార్ దీప్ స్పందిస్తూ.. కొందరు విద్యార్థులు తరచూ పాఠశాల ప్రాంగణంలొనే కాకుండా బయట కూడా అల్లర్లకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వారు చదవకపోవడంతో పాటు మిగతా విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై తల్లిదండ్రులకు పలుసార్లు సమాచారం ఇచ్చిన వారిలో ఎటువంటి మార్పు కనబడకపోవడం విచారకరమన్నారు.
ముగ్గురికి గాయాలు


