మల్కన్గిరి: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మల్కన్గిరి జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమాంలో భాగంగా ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణపై విస్తృత అవగహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అత్యంత దుర్గమ, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదిమ గిరిజన వర్గాలకు చెందిన అర్హులైన ప్రతిపౌరుడిని ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మారుమూల గిరి ప్రాంతాలకు అధికారులు వెళ్లారు. ముఖ్యంగా జనజీవనానికి దూరంగా ఉండే బొండా, దిదాయి ఆదిమ గిరిజనులు, కోయా గిరిజనలు నివసించే ప్రదేశానికి అధికారులు సోమవారం వెళ్లి ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. ఖోయిర్పూట్, పోడియా సమితుల్లోని పలు పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి స్థానికులను తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. మెగా అవగాహన కార్యక్రమంలో మల్కన్గిరి సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయిను నోడాల్ అధికారిగా నియమించడంతో ఆయన పర్యవేక్షణలో కుడుములగూమ్మ తహసీల్దార్, ఇతర అధికారులు గిరిప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. కొత్తవారిని ఓటరుగా నమోదు చేశారు. కాగా గిరి ప్రాంతాలకు వెళ్లిన అధికారులకు గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.


