ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ పట్టణంలో జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ యూత్ లీడర్షిప్ క్యాంపును శ్రీరాం డిగ్రీ కళాశాలలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే శిబిరానికి సబ్ కలెక్టర్ అనుప్పండా, బరంపురం విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ అధికారి జవహార్ లాల్ చౌదురి, కిరణ్కుమార్, కె.సి.పండా కాశీనగర్ ఎన్ఏసీ చైర్మన్ మేడిబోయిన సుధారాణి పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు సామాజిక దృక్పథం, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు కలిగి వుండాలని జిల్లా కలెక్టర్ మునీంద్ర హానగ అన్నారు. శుక్రవారం రెండవ రోజు శిబిరంలో దేహదారుఢ్య శిక్షణాధికారి ఆర్.సి.హెచ్.బెహరా, ఎన్.బి.ఖుంటియా విద్యార్థులకు శారీరిక దృఢత్వం కోరకు అనేక క్లాసులు నిర్వ హించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత బనపల్లి పర్యవేక్షించారు.
గంజాయి రహిత
జిల్లాగా తీర్దిదిద్దుదాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్’ (ఎన్కార్డ్) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 115 గంజాయి హాట్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. నాగావళి తీర ప్రాంతాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా కెమెరాలు అమర్చుతున్నామని, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ సాయంతో మారుమూల ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వెల్లడించారు. విద్యార్థులకు ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. మెడికల్ షాపుల్లో నిద్రమాత్రలు, మత్తు కలిగించే మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ను బలోపేతం చేస్తున్నామని, నవంబర్లో జిల్లాలో 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి విక్రేతలపైనే కాకుండా, పాత నేరస్తులపై కూడా నిరంతరం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ పూజారాణి పుండ్కర్ జిల్లాలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు పరిశీలించారు. అరుదైన జంతువుల చర్మం, గోళ్లు, కొమ్ముల అక్రమ రవాణా జరిగితే సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయ సారథి, వివిధ అధికారులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని మహిళ మృతి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని పట్ట ణానికి చెందిన పొందూరు పార్వతి(55) అనే మహిళ మృతిచెందింది. రైల్వే స్టేషన్ సమీపంలో చిదంబరేశ్వర ఆలయం వద్ద పట్టాలు దాటుతుండగా బరంపురం నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈమె బంగ్లారోడ్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిపారు.


