33 యూనిట్లు రక్తం సేకరణ
జయపురం: స్థానిక మోటారు ఓనర్స్ అసోసియేషన్, సంబాద్–అమొ ఒడిశా సహకారంతో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక 26వ జాతీయ రహదారిలోని జయపురం మోటార్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మేగా రక్తదాన శిబిరాన్ని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి మీణకేతన దాస్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తం ప్రమాదాలలో గాయపడిన వారికి ఎంతో అవసరం అని అన్నారు. సకాలంలో రక్తం లభించక మరణాలు సంభవిస్తున్నాయని.. అటువంటి మరణాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ రక్తదాన చేయాలని పిలుపు నిచ్చారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి రక్తబాండార్ టెక్నీషియన్లు అభయ చరణ పండ, ప్రతిమ పాత్రో, గురు పొరజ మొదలగు వారు దాతల నుంచి రక్తం సేకరించారు. ఈ సందర్భంగా 33 యూనిట్ల రక్తం సేకరించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షులు జి.రమేష్కుమార్, సహాయ కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్, కోశాధికారి ఎస్.రామకృష్ణ పాల్గొన్నారు.
టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి నెట్బాల్ ఎంపికలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు తదితరులు ఈ ఎంపికలను ప్రారంభించారు. మహిళలు, పురుషుల విభాగంలో 12 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈనెల 27న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎంపికల్లో కె.రఘనాథరావు, కేకే రామిరెడ్డి, తిరుపతిరావు, బసవరాజు, జగదీష్, శైలజ, ప్రశాంతి, జానకి, శ్యామలరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పోలాకి: మండల కేంద్రం పోలాకిలో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట నుంచి పోలాకి వైపు వస్తున్న ఆటో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి, ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డుపక్కనే పున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న పల్లిపేటకు చెందిన ఒక యువకుడు, వెదుళ్లవలసకు చెందిన వృద్ధురాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. హెచ్సీ రామ్జీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పొందూరు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సనాతన హిందూ ధర్మ ప్రచారకులు, ప్రవచన శిరోమణి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని కృష్ణాపురం ఆనందాశ్రమంలో సోమవారం ప్రవచనాలు చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. తల్లి, తండ్రి, గురువును గౌరవించినప్పుడు ఆరోగ్యకరమైన సమాజ స్థాపన జరుగుతుందన్నారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పలువురు స్వామీజీలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్: జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శ్రీకాకుళం చాప్టర్ నూతన చైర్మన్గా వాటర్ రిసోర్స్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ డోల తిరుమలరావు, కార్యదర్శిగా ఐతం కళాశాల ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నూతన కార్యవర్గ ఎన్నిక పరిశీలకులు ముని శ్రీనివాస్, చింతాడ రాజశేఖర్ పర్యవేక్షణలో నూతన కమిటీలో 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు.
33 యూనిట్లు రక్తం సేకరణ
33 యూనిట్లు రక్తం సేకరణ


