
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రమేష్
కొరాపుట్: జయపూర్ విధాన సభ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎ.రమేష్ రావు (చిన్ను) నియమితులయ్యారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాత్రో కొన్ని జిల్లాలకు సంబంధించి విధాన సభ యువజన కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. అందులో రమేష్ పేరు కూడా ప్రకటించారు. గత 15 సంవత్సరాలు జయపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో రమేష్ సేవలు అందిస్తున్నారు. రమేష్ను జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీణిపతి, కొరాపుట్ జిల్లా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ భగవాన్ భాహీణిపతి అభినందించారు.
ఉప్పొంగిన గుమ్మగెడ్డ
పర్లాకిమిడి: గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు రాణిపేట రోడ్డులో గల గుమ్మగెడ్డ పొర్లి పొంగుతోంది. పర్లాకిమిడి నుంచి గుమ్మగెడ్డ వరదనీరు ఆంధ్రప్రదేశ్లోని పాతపట్నం మండలంలో గల బైదలాపురం, రోంపివలస, అనంతగిరి గ్రామాలకు ప్రవహిస్తోంది. గజపతి జిల్లాలో వంశధార, మహేంద్రతనయ నదులు కూడా వరదనీరుతో నిండడంతో రైతులు ఉభాలకు సిద్ధమవుతున్నారు.
సహాయక చర్యల్లో
ఎలైట్ కే9 స్క్వాడ్
భువనేశ్వర్: రాష్ట్ర అగ్నిమాపక విభాగం సహాయక చర్యల్లో ఎలైట్ కే9 స్క్వాడ్ మోహరించారు. శోధన, రక్షణ వంటి కీలక కార్యకలాపాల్లో పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సిబ్బందికి సహాయకంగా కే9 జాగిలాల ప్రత్యేక బృందం గుర్తింపు పొందింది.
ఆదిత్యుని సన్నిధిలో ప్రభాస్ శ్రీను
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామివారిని సినీ నటుడు పీరు శ్రీనివాస్ (ప్రభాస్ శ్రీను) బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. హైదరాబాద్లోని తన స్నేహితులతో పాటు నరసన్నపేటలో వినాయక చవితి మహోత్సవాలకు హాజరైన ప్రభాస్ శ్రీను.. ఆదిత్యున్ని దర్శించుకొని ఆలయ విశేషాలను స్నేహితులకు వివరించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ సిబ్బంది ప్రత్యేక స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మల బృందం వారికి వేదాశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.కల్యాణి, డి.సుధలు కోరారు. శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం ఐసీడీఎస్ పీడీ ఐ.విమల అధ్యక్షతన జిల్లాలోని 16 ప్రాజెక్టుల అధ్యక్ష, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పీడీ విమల దృష్టికి తీసుకొచ్చారు. పీడీ విమల మాట్లాడుతూ.. తన పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, రాష్ట్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలని, అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రీస్కూల్ పిల్లల శాతం పెంచాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు పరిశుభ్రంగా ఉన్నదీ.. లేనిదీ సమీప సచివాలయాల్లో పరీక్ష చేయించి, ఆ నివేదికలను ప్రతివారం తనకు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులందరికీ సక్రమంగా పౌష్టికాహారం పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ల నాయకులు కె.సుజాత, పి.లతాదేవి, జె.కాంచన, బి.శాంతమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలుగా
అభివృద్ధి చెందాలి
సోంపేట: స్వయం శక్తి సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ అన్నారు. మండలంలోని మూలపొలం గ్రామంలో సముద్రపు నాచు పెంచే విధానంపై మత్స్యశాఖ, సెర్ప్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సముద్రపు నాచుతో అధిక ఆదాయం పొందవచ్చునని తెలియజేశారు. గతంలో చేపల పెంపకం నిర్వహిస్తున్న మహిళలు, ప్రస్తుతం సముద్రపు నాచు పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు.

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రమేష్

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రమేష్