
దీర్ఘాశిలో చైన్స్నాచింగ్
పోలాకి: దీర్ఘాశి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దొంగలు హల్చల్ సృష్టించారు. మెండ గడ్డెమ్మ(63) అనే వృద్ధురాలు పశువులకు దాణా పెడుతుండగా వెనక నుంచి వచ్చిన అగంతకుడు బంగారు తాడు (సుమారు పావు తక్కువ మూడు తులాలు) లాక్కొని అక్కడే బైక్పై ఉన్న ఇంకో వ్యక్తి సహాయంతో పరారయ్యారు. తాడు లాగే సమయంలో తన నోటిని గట్టిగా మూసివేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ రంజిత్ నేతృత్వంలో చైన్స్నాచర్స్ కోసం వేట ముమ్మరం చేశారు. కొందరు అనుమానితులను గుర్తించి విచారిస్తున్నట్లు సమాచారం. నిత్యం రద్దీగా వుండే పోలాకి–నరసన్నపేట రహదారిలో చైన్స్నాచర్లు పరారైనట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
కార్మికులకు అండగా..
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రమదోపిడీకి గురవుతున్న కార్మికులకు కార్మికశాఖ ఉప కార్మిక కమిషనర్ డి.దినేష్కుమార్ అండగా నిలిచారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి శుక్రవారం కార్మికులకు రూ.45514 వేతనాన్ని యాజమాన్యాల నుంచి వసూలు చేసి డి.డి.రూపంలో తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా డీసీఎల్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్రకారం ఆన్లైన్లో తనిఖీ నిర్వహించాలని వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించగా.. అందులో నలుగురు కార్మికుల వేతనాల్లో తేడాల్ని గమనించామన్నారు. సంబంధిత యజమానుల వద్ద నుంచి తేడా వేతనాన్ని రికవరీ చేసి కార్మికులకు అందించామని చెప్పారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి పంచాయతీ రామనగరం గ్రామానికి చెందిన బొడ్డు రామన్న (37) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్న తన పొలంలో ఎరువులు వేసిన తర్వాత గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి చెరువులో తేలుతున్న రామన్నను బయటకు తీసి టెక్కలి జిల్లాఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రామన్నకు భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు.
మా సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారు?
ఇచ్ఛాపురం: తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద ఖాతాదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం పోస్టాఫీసును పరిశీలించేందుకు వ చ్చిన పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ను కలిసి తమ గోడు వినిపించారు. స్కామ్ జరిగి నెలరోజులైనా పోస్టల్ సిబ్బంది పట్టించుకోకపోవడం తగదని ఖాతాదారులు బాలరాజు, సీహెచ్ లోహిదాస్, శ్రీను తదితరులు వాపోయారు.
జాతీయ పోటీలకు కోచ్గా అర్జున్రావు రెడ్డి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ బాస్కెట్బాల్ కోచ్ గాలి అర్జున్రావు రెడ్డి జాతీయ పోటీలకు కోచ్గా నియమితులయ్యారు. పంజాబ్లో సెప్టెంబర్ 2 నుంచి జరగనున్న 75వ ఆలిండియా జూనియర్స్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శాప్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన నియామకం పట్ల శ్రీకాకుళం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, కోచ్లు, సీనియర్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు.
7న సంపూర్ణ చంద్రగ్రహణం
అరసవల్లి: సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తున్నట్లుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈఓ కెఎన్వీడీవీ ప్రసాద్లు తెలియజేశారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం 7వ తేదీ రాత్రి వేళలో గ్రహణ సమయం కావడంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు సర్వదర్శనాలకు అవకాశమిచ్చి.. అనంతరం భోగసమయం దాటాక అంటే మధ్యాహ్నం 2 గంటలకే ఆలయ ప్రధాన ద్వారాలు మూసివేయనున్నామని వారు వివరించారు. గ్రహణానంతరం ఆలయంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం మరుసటి రోజు అనగా 8వ తేదీ సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతివ్వనున్నట్లుగా వారు శుక్రవారం ప్రకటించారు. భక్తులు గమనించి గ్రహణ నియమాలను పాటించాలని కోరారు.

దీర్ఘాశిలో చైన్స్నాచింగ్