
కలవరపెడుతున్న కలరా
● జాజ్పూర్, భద్రక్లో కలరా
విజృంభణ
● ఇప్పటివరకు 10 మంది మృతి
● దాదాపు 600 మంది పీడితులు
● కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
భువనేశ్వర్: జాజ్పూర్ జిల్లాలో వెలుగు చూసిన అతిసార పొరుగు భద్రక్ జిల్లాకు విస్తరించింది. నిత్యం పీడితులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్షల్లో అతిసారం కలరాగా విజృంభించినట్లు తేటతెల్లం అయింది. పరిస్థితి మరింత విషమించకుండా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అతిసారం నమూనా పరీక్షలో కలరా పాజిటివ్గా తేలింది. 41 నమూనాల పరీక్షల్లో 8 కలరా పాజిటివ్గా తేలింది. ఈ నివేదికల ప్రకారం 600 మంది పీడితులు కలరా బారినపడినట్లు స్పష్టం అయింది. గత 4 రోజుల్లో జాజ్పూర్ జిల్లాలో 10 మంది మృతి చెందారు. 10 రోజుల్లోగా కాలుష్య నివారణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి ఆదేశించారు. విస్తృత అవగాహన, క్షేత్రస్థాయి నివారణ మరియు ప్రాథమిక గుర్తింపు మరియు చికిత్స ద్వారా పరిస్థితి అదుపులో ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా తెలిపారు.
కిక్కిరిసిన ఆరోగ్య కేంద్రాలు
జాజ్పూర్ జిల్లాలో వ్యాసనగర్ మరియు జాజ్పూర్ మున్సిపాలిటీ, ధర్మశాల, రసూల్పూర్, కొరై, దానొగొడి, సుకిందాతో సహా 6 మండలాల్లో 600 మందికి పైగా రోగులు విరేచనాలతో బాధపడుతున్నారు. వారందరినీ వైద్య కేంద్రాల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని పడకలు లేకపోవడంతో, రోగులకు నేలపై చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో సరైన చికిత్స, వైద్యం అందడం లేదని పీడితులు వాపోతున్నారు. ఆరోగ్యం కుదుటపడిందని ఇంటికి పంపించిన వెంటనే వాంతులు, విరేచనాలు వంటి కలరా లక్షణాలు బాధించడంతో తిరిగి ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విందులు నిషేధం
జాజ్పూర్ ప్రాంతంలో విందు, వినోదాలు నిషేధించినట్లు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా రొజ్జొ పండగ సందర్భంగా విందులు, సామూహిక కార్యక్రమాలు జరగడం ఆనవాయితీ. ప్రస్తుత ప్రతికూల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ విందు వినోదాలపై ఆంక్షలు విధించడం అనివార్యం అయిందని అధికార వర్గం పేర్కొంది. జిల్లాలో కలరా గుర్తింపు కారణంగా ప్రజలు స్వీయ అవగాహనతో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికార యంత్రాంగం అభ్యర్థించింది. ఇంట్లో వండిన ఆహారం, మరిగించిన మరియు వడపోసిన పరిశుద్ధ నీరు మాత్రమే వినియోగించాలని తెలిపారు. దైనందిన నిత్య వినియోగాలకు నది, కాలువ, చెరువు నీరు నివారించాలని తెలియజేశారు.
జాజ్పూర్ సందర్శనకు కేంద్ర బృందం
జాజ్పూర్ జిల్లాలో అతిసార తీవ్రతరమై కలరాగా విజృంభించింది. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 14 మంది సభ్యుల బృందాన్ని జాజ్పూర్ జిల్లాకు పంపనుందని రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా శనివారం తెలిపారు. కేంద్ర పరిశీలన బృందం త్వరలోనే ప్రభావిత ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరియు ఒడిశా ఆరోగ్య శాఖ సంయుక్త బృందం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. ప్రభావితులకు సకాలంలో పరీక్షలు నిర్వహించిన సముచిత వైద్యం అందజేస్తున్నట్లు వివరించారు. 200 నమూనాలకు నిర్వహించిన పరీక్షల్లో 11 నమూనాల్లో విబ్రియో కలరా పాజిటివ్గా తేలిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాజ్పూర్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రిలో 213 మంది రోగులు అతిసారానికి చికిత్స పొందుతున్నారు. పరిస్థితిని రాత్రింబవళ్ళు నిరవధికంగా పర్యవేక్షించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేక నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేశారు.
కటక్ జిల్లాకు విస్తరణ
జాజ్పూర్ జిల్లాలో తలెత్తిన అతిసార పొరుగు జిల్లా భద్రక్ నుంచి తాజాగా కటక్ జిల్లాకు విస్తరించింది. అఠొగొడొ మండలం బంకిలోని ఘోలాపూర్ గ్రామంలో అతిసారం వ్యాప్తి చెందింది. ఈ ప్రాంతంలో 4 మంది పిల్లలు సహా 10 మందికి పైగా వ్యాధి బారినపడ్డారు. వారిలో 6 మందిని అఠొగొడొ ఆస్పత్రిలో చేర్చారు. మరో 2 మందిని కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది.

కలవరపెడుతున్న కలరా