
ఈనెల 20న ప్రధాని మోదీ రోడ్ షో
భువనేశ్వర్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 20వ తేదీన ఒక్కరోజు పర్యటనకు రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. త న పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జనతా మైదాన్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి నేతృత్వంలోని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం జూన్ 12 నుంచి 20 వరకు ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 20వ తేదీ మధ్యా హ్నం 2 గంటలకు ప్రధానమంత్రి స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుతారు. అక్కడ నుంచి రోడ్ షో కార్యక్రమంతో ముందుకు సాగి వార్షికోత్సవ ప్రాంగణానికి చేరుతారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల సాఫల్యత, డాక్యుమెంటరీలు, మహిళా సాధికారత, ఉపాధి, యువజన అభివద్ధి, గిరిజన సంక్షేమం మరియు రైతు సంక్షేమ పథకాలకు సంబంధించిన పలు కార్యక్రమాల అమలు తీరు ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి శనివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్ మరియు ప్రభాతి పరిడా, క్యాబినేట్ మంత్రులు హాజరయ్యారు. దీనిలో భాగంగా పర్యటనకు సంబంధించిన సన్నాహాలపై చర్చించారు.
భువనేశ్వరి దేవి చిత్ర దర్శనం
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రథయాత్ర దగ్గర పడుతోంది. మరోవైపు భారీ స్నానమాచరించడంతో అస్వస్థతకు గురైన స్వామివారికి జ్వరం తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చీకటి మండపంపై గోప్య ఉపచారాలతో త్వరగా కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అస్వస్థతకు గురి కావడంతో మూల విరాటులను అనవసర గదికి తరలించారు. రత్న వేదిక ఖాళీ అయింది. మూల విరాటుల స్థానాల్లో చిత్రపటాలు దర్శనం ఇస్తున్నాయి. దేవీ సుభద్ర స్థానంలో భువనేశ్వరి మాత చిత్రపటం భక్తులకు దర్శనమిస్తోంది. వికసిత పద్మాసనంలో ధవళ వస్త్ర ధారణతో పసుపు పచ్చని వర్ణ శోభతో చతుర్భుజి భువనేశ్వరి సౌందర్య రాశిగా ఆకట్టుకుంటుంది. రెండు చేతుల్లో ఊర్ధ్వముఖంగా పద్మాలు, మరో రెండు చేతుల్లో అభయ మరియు వరద ముద్రలను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నిలువెత్తున శోభాయమానమైన ఆభరణాల అలంకరణతో దేవీ తళుక్కుమంటోంది. శ్యామ వర్ణపు కురులతో శిరస్సున మకర మస్తకం, మెడలో పద్మ హారము, కంఠాభరణాలు, చెవులకు కమ్మలు, జుమ్కాలతో పుడక, నత్తు, బులాకి వంటి నాసిక ఆభరణాలతో భువనేశ్వరి అపురూప సౌందర్యం ఆకర్షణీయంగా ఆకట్టుకుంటోంది. దేవీ భువనేశ్వరి చిత్రపటం దగ్గర విశ్వధాత్రి (భూదేవి), శ్రీదేవి (లక్ష్మి) ప్రతిమలు చోటు చేసుకోవడం విశేషం. ఉభయ పార్శ్వాల్లో జయ, విజయులు చామర మరియు వింజామర సేవకులుగా చిత్రపటంలో చోటుచేసుకున్నారు.