
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
రాయగడ: ప్రస్తుతం వర్షాలు ప్రారంభమవ్వడంతో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఫరూల్ పట్వారీ సూచించారు. ఈ మేరకు స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాధి నివారణ చర్యలపై అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. మురికి కాలువలను పరిశుభ్రం చేయాలన్నారు. ఏఎన్ఎం, అంగన్వాడీ కేంద్రాలు, ఆశ కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు సిద్ధంగా ఉండేలా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గొట్టపు బావుల నీటికి పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
దోమ తెరలపై అవగాహన
మలేరియా వ్యాధి బారి నుంచి రక్షణ కల్పించే దోమ తెరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. హాస్టల్లో విద్యార్థులు తీసుకునే తాగునీటి విషయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ట్యాంకులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో అధికారులు అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చంద్ర కాంత్ మాఝి, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారి గోపాల్ నాయక్, జిల్లా ముఖ్య వైద్యశాఖ అధికారి డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పాఢి తదితరులు పాల్గొన్నారు.
వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలి
అధికారులకు కలెక్టర్ పట్వారీ ఆదేశం