
అభివృద్ధి పథంలో నడిపిస్తాం
పర్లాకిమిడి: గజపతి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. పర్లాకిమిడి పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సర్క్యూట్ హౌస్కు చేరుకుని అక్కడ నుంచి నేరుగా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రహాల్కు వెళ్లారు. ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర శోబోరో, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాస్థాయి ఒడిశా విజన్ 2036–47 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 21 హామీల్లో 11 పూర్తి చేశామని, మరో ఏడు హామీలు త్వరలోనే నెరవేరుస్తామని తెలియజేశారు. ఒడిశా విజన్ 2036– 47 నాటికి గజపతి జిల్లాలో వ్యవసాయం, పండ్ల ఉత్పత్తి పరిశ్రమలు, టూరిజం, మిషన్ శక్తి, స్వయం సహాయక డ్వాక్రా గ్రూపులు ప్రగతి పథంలో పయనిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ప్రస్తుతం రూ.22 వేల కోట్లతో అనేక కంపెనీల శంకుస్థాపనలు పూర్తయ్యాయని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో 72 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం ఒడిశా విజన్ 2036–47 డాక్యుమెంట్ను విడుదల చేశారు.
చెక్కులు అందజేత
ఈ సందర్భంగా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ కుటుంబాలకు నష్ట పరిహారం కింద రూ.3,05,000లు నలుగురికి, అలాగే కార్మిక వర్గాల కుటుంబాలకు నష్ట పరిహారం కింద మరో 14 మందికి రూ.50 వేలు చొప్పున్న చెక్కులను అందజేశారు. అలాగే మిషన్ శక్తి మహిళా గ్రూపులకు చెక్కులు, ప్రకృతి మిత్ర అవార్డులు కింద రూ.10 వేలు చొప్పున్న ఐదుగురుకి అవార్డులు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ బిజయ్ కుమార్ దాస్, ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా, డీఎఫ్వో కె.నాగరాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శంకర్ కెరకెటా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్
ఒడిశా విజన్ 2036–47
డాక్యుమెంట్ విడుదల

అభివృద్ధి పథంలో నడిపిస్తాం