బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

తరతరాల అపురూప జ్ఞాపిక

కొండపల్లి బొమ్మల పరిశ్రమకు 400 ఏళ్ల ఘన చరిత్ర నైపుణ్యంతో కళాత్మకంగా కొయ్య బొమ్మల తయారీ తెల్లపొనికి కలప కొరతతో కళాకారులకు ఇబ్బందులు బొమ్మల పరిశ్రమపై ఆధారపడిన 150 కుటుంబాలు

న్యూస్‌రీల్‌

ముందు ముందు గడ్డుకాలం

సహజ సిద్ధ రంగులతో ఆదరణ

కొండపల్లి బొమ్మ

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మలు తరతరాల సాంస్కృతిక వారసత్వం, కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచాయి. దేశానికి వన్నె తెచ్చిన ఎన్నో ప్రాచీన కళలు అంతరించినా 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కొయ్యి బొమ్మలకు హస్తకళాకారులు నేటికీ జీవంపోస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ బొమ్మలు వాస్తవిక దృక్పథాన్ని కలిగిస్తాయి. వివిధ రకాల పండ్ల తొక్కలు, ఆకులతో తయారు చేసే సహజ సిద్ధ రంగులతో ఈ బొమ్మలు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. బొమ్మల పరిశ్రమలో కళాకారుల నైపుణ్యం, తయారీ మెటీరియల్‌, ముడి సరుకు, తదితర అవసరాలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు కొంతమేర సహకారం అందిస్తున్నాయి. ఏటా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో సుమారు రూ.2.50 కోట్ల మేర బొమ్మల వ్యాపారం జరుగుతోంది.

బొమ్మల చారిత్రక నేపథ్యం

14వ శతాబ్దంలో కొండపల్లి కోట నిర్మాణానికి పునాది పడింది. 16వ శతాబ్దంలో నిర్మించిన రాజ భవనాలకు నగిషీలు అద్దేందుకు రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి వచ్చిన రాజవంశీకులు కొండపల్లి బొమ్మల పరిశ్రమకు ప్రాణం పోశారు. బ్రిటీష్‌ పాలనలో రాజస్థాన్‌ నుంచి వచ్చిన వారు బొమ్మల తయారీ పరిశ్రమను తమ జీవనోపాధిగా చేసుకున్నారు. కొండపల్లి అడవుల్లో లభించే తేలికపాటి తెల్లపొనికి చెక్కతో ఆకర్షణీయమైన బొమ్మలను కళాత్మకంగా తయారు చేసేవారు. రాజస్థాన్‌ కళాకారుల వద్ద పనిచేసిన స్థానికులు సైతం బొమ్మల తయారీలో నైపుణ్యం సాధించారు. అనతి కాలంలో బొమ్మల తయారీని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం 150 కుటుంబాలు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.

నైపుణ్యంతో కళాత్మక బొమ్మలు

కొండపల్లి కొయ్యి బొమ్మలను హిందూ పురాణాలు, గ్రామీణ నేపథ్యం, జానపద కళల నుంచి ప్రేరణ పొంది తయారు చేస్తారు. దశావతారాలు, సీతారామలక్ష్మణులు, ఏనుగు అంబారీ, విష్ణు మూర్తి, బ్రహ్మదేవుడు, పల్లకిలో పెళ్లికొడుకు, ఎడ్లబండితో రైతు, తలలు ఊపే బొమ్మలతో పాటు మార్కెట్‌లో ఆదరణ కలిగిన అంశాలను ఎంచుకుని బొమ్మలు తయారు చేస్తారు. అడవుల్లో లభించే తేలికగా ఉండే తెల్లపొనికి చెక్కతో ఎంచుకున్న ఆకృతితో బొమ్మలు చెక్కి వాటికి చింతగింజల పొడి, రంపపు పొట్టు పేస్ట్‌తో అతికించి సున్నం పూసి ఎండబెడతారు. ఆకర్షణీయంగా రంగులు అద్ది విక్రయాలకు సిద్ధం చేస్తారు. కొండపల్లి బొమ్మలకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌ గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవాన్ని పురష్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కొండపల్లి బొమ్మల వేడుకలు నిర్వహించారు.

తెల్లపొనికి కలప కొరత

బొమ్మల తయారీలో ఉపయోగించే తెల్లపొనికి చెట్లు కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అంతరించాయి. శతాబ్దాలుగా బొమ్మల తయారీలో వినియోగించడం వల్ల చెట్లు తరిగి పోయాయి. దీంతో బొమ్మల తయారీకి చేతివృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటవీశాఖ అధికారులు తెల్లపొనికి మొక్కలు పెంచి అడవిలో నాటుతున్నప్పటికి జంతుజాలం సంచారంతో అవి నశిస్తున్నాయి. పొరుగు మండ లాలు తిరువూరు, ఎ.కొండూరు ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలతో తెల్లపొనికి కలప తెచ్చుకోవల్సి వస్తోంది. కొంతమంది మార్కెట్‌లో లభించే న్యూఉడ్‌్‌, కొన్ని రకాలు టేకు కలపతో బొమ్మలను తయారు చేయడం ప్రారంభించారు.

అక్కరకు రాని ఉడ్‌ బ్యాంక్‌ సేవలు

బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌, బొమ్మల ఉత్సవాలు నిర్వహించి ప్రోత్సాహం అందిస్తున్నారు. తెల్లపొనికి కలప కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో కొండపల్లిలో ఉడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయించారు. అయితే తెల్లపొనికి బదులు బూరుగు, పనస, నల్లమద్ది కలప పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ రకాల కలప తమకు వద్దని, బొమ్మల తయారీకి పనికిరాదని కళాకారులు తేల్చి చెప్పారు.

గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా కొండపల్లి బొమ్మ

ముంచెత్తుతున్న ప్లాస్టిక్‌

400 ఏళ్లకు పైగా అనేక ఒడిదోడుకులతో నెట్టుకొచ్చిన కొండపల్లి బొమ్మల పరిశ్రమ భవిష్యత్‌కు గడ్డుకాలం ఎదురుకానుంది. గతంలో 250 కుటుంబాల వరకు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి జీవించేవి. ప్రస్తుతం 150 కుటుంబాలు మాత్రమే బొమ్మలు తయారు చేస్తున్నాయి. ఇటీవల కలప పంపిణీలో అధికారులు చేపట్టిన సర్వేలో 80 కుటుంబాలు మాత్రమే పూర్తిగా బొమ్మల పరిశ్రమలో ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుత తరం తమ బిడ్డలను చదివించి ఉద్యోగస్తులుగా చూడాలని ఆశపడటం, తెల్లపొనికి చెట్లు అంతరించడం, కూలీల కొరత, మార్కెటింగ్‌లో పోటీతత్వంతో అనేక మందిలో బొమ్మల తయారీ పరిశ్రమపై ఆసక్తి సన్నగిల్లుతోంది. కళాకారులను ప్రోత్సహించి బొమ్మల పరిశ్రమ అంతరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

దేశంలో ఎన్నో వారసత్వ కళలు అంతరిస్తున్నప్పటికీ కొండ పల్లి బొమ్మలకు ఆద రణ ఉంది. ఈ బొమ్మలు ఆకర్షణీయంగా ఉండాలంటే సహజ సిద్ధ రంగులు వాడాలి. గ్రామీణ వాతావరణం, కుటుంబ నేపథ్యాలతో గతంలో సుమారు 80 రకాల బొమ్మలు తయారు చేసేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య పూర్తిగా తగ్గించారు. ఇటీవల అడవిలో దొరికే ఆకులు, కూరగాయలతో సహజ సిద్ధ రంగుల తయారీలో బొమ్మల కళాకారులకు శిక్షణ ఇచ్చాను. కొంతమందే పాటిస్తున్నారు. దుకాణాలు లేని వారికి ట్రైనింగ్‌ సెంటర్‌లో దుకాణాలు ఇస్తే బాగుంటుంది.

– రమేష్‌ రామనాథం, హస్తకళల డిజైనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement