Husband And Wife Brutally Murdered A Man Together In Krishna District Yanamalakuduru - Sakshi
Sakshi News home page

విజయవాడ: వెలుగులోకి షాకింగ్‌ ఘటన.. తమ పెళ్లి చేసిన మిత్రుడినే..

Aug 8 2023 1:46 AM | Updated on Aug 8 2023 11:30 AM

- - Sakshi

కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురులో కోల్డ్‌బ్లడెడ్‌ మర్డర్‌ జరిగింది.

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురులో కోల్డ్‌బ్లడెడ్‌ మర్డర్‌ జరిగింది. భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత ఆ మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన గ్రంథి పురుషోత్తం (41) పాత కార్లు కొని విక్రయించే వ్యాపారం చేస్తాడు.

అతను అవివాహితుడు. గత నెల 31వ తేదీన కారు కొనడానికి రాజమండ్రి వెళ్తున్నానని తన సోదరుడు నాగేశ్వరరావుకు చెప్పాడు. కాని ఆరోజు రాజమండ్రి వెళ్లకుండా మొగల్రాజపురం వద్ద మిత్రుడు బలగం మొహిందర్‌ను కలసి అతని కారు ఎక్కి యనమలకుదురు నేతాజీనగర్‌లో ఉన్న మొహిందర్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిద్దరూ అర్ధరాత్రి వరకు పూటుగా మద్యం తాగారు.

ఆ తరువాత పురుషోత్తం జాడ తెలియలేదు. ఈ విషయమై మొహిందర్‌ను పురుషోత్తం కుటుంబ సభ్యులు అడగ్గా.. పని ఉందని చెప్పి మధ్యలోనే పురుషోత్తం వెళ్లిపోయాడని బదులిచ్చాడు. పురుషోత్తంకు చెందిన రెండు ఫోన్‌లకు కుటుంబ సభ్యులు కాల్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చాయి. దీంతో పురుషోత్తమ్‌ సోదరుడు నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

వెలుగు చూసిన ఘోరం
పెనమలూరు పోలీసులకు పురుషోత్తం మిస్సింగ్‌ కేసుపై అనుమానం తలెత్తింది. దీంతో పోలీసులు మొహిందర్‌ అతని భార్య శశికళను తమదైన స్టైల్‌లో విచారించారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. పురుషోత్తం మొహిందర్‌ సన్నిహిత మిత్రులు. మొహిందర్‌ విజయవాడలో ఒక కార్ల కంపెనీలో పనిచేసే సమయంలో శశికళతో పరిచయమై వారిద్దరూ ప్రేమించుకోగా, వారి వివాహం పురుషోత్తం దగ్గరుండి జరిపించాడు.

అప్పటి నుంచి ఆ మొహిందర్‌ ఇంటికి తరచుగా పురుషోత్తం వచ్చి వెళుతుంటాడు. మొహిందర్‌కు ఇటీవల అప్పులు ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో శశికళ, మొహిందర్‌ కలిసి పురుషోత్తంను హత్య చేయటానికి పథకం రచించారు. అందులో భాగంగా గత నెల 31వ తేదీన పురుషోత్తంను యనమలకుదురులోని తమ ఇంటికి మొహిందర్‌ తీసుకువెళ్లి అక్కడ ఫుల్‌గా మద్యం తాగించాడు. అదును చూసి మొహిందర్‌ తన భార్య శశికళ సహకారంతో పురుషోత్తం మెడకు వైరు బిగించి హత్య చేశారు.

పురుషోత్తం వద్ద ఉన్న సుమారు రూ.3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశారు. అనంతరం కారులో పురుషోత్తం మృతదేహాన్ని ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు తీసుకెళ్లి గోదావరిలో పడేశారు. పురుషోత్తం వద్ద అపహరించిన బంగారు ఆభరణాలను గుంటూరులో విక్రయించి అప్పులు తీర్చుకున్నారు.

ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ తమకు ఏమీ తెలియనట్లు నటించారు. పెనమలూరు పోలీసులు కేసును ఛేదించి హత్య ఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు. పురుషోత్తం మృతదేహం కోసం గోదావరిలో పోలీసులు వెతికినా దొరకలేదు. బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. భార్యాభర్తలపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement