విద్యుత్షాక్తో ఒకరి మృతి
దోమకొండ: మండలంలోని లింగుపల్లి గ్రామానికి చెందిన రాకుల శంకర్ (43) సోమవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. గ్రామంలో ప్రయివేట్ కరెంట్ హెల్పర్గా పనిచేసే శంకర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇంటికి విద్యుత్ వైర్ల కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో విద్యుత్ స్థంభం నుంచి కిందపడ్డాడు. సీసీ రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శంకర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య నాగమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
గాయపడిన మహిళ ..
రుద్రూర్: పోతంగల్ రైస్మిల్లులో పనిచేస్తూ గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులవ్వ (40) గత నెల 15న రైస్మిల్లులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ బెల్ట్ చుట్టుకొని గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ అస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 21న రాత్రి మృతి చెందింది. సోమవారం కోటగిరి తహసీల్దార్ గంగాధర్ సమక్షంలో కొత్తపల్లి గ్రామంలో వైద్యులు పోస్టుమార్టం ని ర్వహించారు. మృతురాలి భర్త రేణి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని మహిళ ..
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు బైపాస్ రోడ్డులో ఉన్న బాగారెడ్డి నర్సరీ వద్ద గుర్తు తెలియని మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. బస్సును స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొన్నారు.


