90 ఏళ్ల కుర్రాడు!
● వృద్ధాప్య కష్టాలు ఎరుగని కిష్టన్న
● యువకులతో పోటీపడుతూ
వ్యవసాయ పనులు
● ఎక్కడికి వెళ్లినా సైకిల్పైనే..
డొంకేశ్వర్(ఆర్మూర్): వృద్ధాప్య కష్టాలు ఏ మాత్రం తెలియని కిష్టన్న 90 ఏళ్ల వయస్సులో రయ్మని దూసుకుపోతున్నారు. పొలం గట్లపై యువరైతులతో పోటీ పడుతూ వారి ఉత్సాహాన్ని నింపుతున్నారు. డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామానికి చెందిన బానోత్ కిష్టన్న 90 ఏళ్ల వయస్సు వచ్చినా వృద్ధాప్యం అంటే ఏమిటో తెలియని వ్యక్తిలా అందరినీ ఆశ్యపరుస్తున్నారు. వ్యవసాయదారుడైన కిష్టన్న ఎక్కడికి వెళ్లినా గత 40 ఏళ్లుగా సైకిల్పైనే ప్రయాణం చేస్తున్నాడు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా, మండలం దాటి నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాలకు సైతం సైకిల్పైనే వెళ్లడం అలవాటుగా మారింది. పొలానికి ఇంటికి ప్రతిరోజూ నాలుగైదు కిలో మీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు. కాగా బంధువుల ఇళ్లకు, శుభ కార్యాలకు కూడా సైకిల్నే వాడుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. కిష్టన్న గత 35 సంవత్సరాలుగా ఒకే సైకిల్ను సెంటిమెంట్గా వాడుతున్నాడు. కిష్టన్న కొడుక్కి 55 ఏళ్లు, మనవడికి 35 ఏళ్లు. ప్రస్తుతం జీవన శైలిలో 60 సంవత్సరాలు బతికితేనే మహాభాగ్యం అనుకుంటున్న రోజుల్లో కిష్టన్న 90 ఏళ్ల ప్రాయంలో కూడా సైకిల్ తొక్కడం, వ్యవసాయం చేయడం నిజంగా వరమనే చెప్పాలి.
వ్యవసాయం, సైకిల్ తొక్కడమే..
ప్రతిరోజూ వ్యవసాయ పనులు చేయడం, సైకిల్ తొక్కడమే తన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని కిష్టన్న చెబుతున్నాడు. రొట్టెలు తింటానని, మాంసాహారం, మద్యం, కల్లుకు దూరంగా ఉంటానని అంటున్నాడు. పొలాల్లో పండించిన చిరు ధాన్యాలు, కూరగాయలు తింటానని తెలిపారు.
90 ఏళ్ల కుర్రాడు!


