ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!
మూడు నెలలకోసారి..
విప్లవాత్మక మార్పులు
● వినూత్న విద్యాబోధనపై అధ్యయనం
● ఐదు రోజుల పర్యటన
● 16 మంది దరఖాస్తు
● జిల్లా నుంచి ముగ్గురి ఎంపిక
ఖలీల్వాడి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కన్వీనర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీచర్లకు ఫారిన్ టూర్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేశారు. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 160 మందిని ఎంపిక చేసి నాలుగు బృందాలుగా విభజించి సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ వంటి దేశాలకు నవంబర్లో పంపించనున్నారు. ఎంపికై న వారు ఆయా దేశాల్లో ఐదు రోజులు విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణలో ఎడ్యుకేషన్లో సమూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విద్యావేత్తలు భావిస్తున్నారు.
జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఒకరు ప్రధానోపాధ్యాయులు, మరొకరు స్కూల్ అసిస్టెంట్, ఇంకొకరు ఎస్జీటీ ఉంటారు. వీరి దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ పరిశీలించి, జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.
నాలుగు దేశాల్లో..
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ హై స్కూళ్లు 1156 ఉండగా ఇందులో 5292 మంది హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పని చేస్తున్నారు. ఎంపికై న వారు రాష్ట్రస్థాయి బృందంతో కలిసి జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు.
ఎంపిక ఇలా..
బోధనలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు, పాస్పోర్టు కలిగి ఉన్నవారిని కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సీనియర్ అధికారులు అర్హులైన ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే టీచర్లను వాళ్ల మూడేళ్ల పనితీరును జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఈ ఎంపికయ్యే టీచర్లు విద్యార్థులను స్కూల్లో చేర్పించడానికి తీసుకున్న చొరవ, అభ్యసనకు సామర్థ్యం, వినూత్న బోధన పద్ధతులు, స్కూల్ అభివృద్ధి, ఇంగ్లిష్లో మాట్లాడటం, గతంలో పొందిన పురస్కారాలు కలిగిన టీచర్లను జిల్లా కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది.
కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ..
జిల్లా నుంచి ఫారిన్ లెర్నింగ్ టూర్కు బుధవారం చివరి తేదీ కావడంతో హెచ్ఎంలు ముగ్గురు, ఎస్జీటీలు ఇద్దరు, స్కూల్ అసిస్టెంట్లు పదకొండు మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇందులో ముగ్గురిని ఎంపిక చేస్తుంది.
మూడు నెలలకు ఒకసారి టీచర్లను విదేశాలకు పంపిస్తే బాగుంటుంది. అక్కడి విద్యా విధానాన్ని ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా మల్చుకొని విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఫారిన్ లెర్నింగ్ టూర్ను ఏర్పాటును స్వాగతిస్తున్నాం. ఇది ప్రతి పాఠశాల నుంచి టీచర్లు వెళ్లే విధంగా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది.
– శ్రీకాంత్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
ఎంపికై న టీచర్లు ఫారిన్ విద్యా విధానాలు, అక్కడి బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా కొత్త విషయా లు తెలుసుకుంటారు. దీంతో ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. – యానం విజయ్,
ఎస్సీ, ఎస్టీ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!
ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!


