భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
● ‘భూ భారతి’ చట్టంతో
రైతుల భూములకు భరోసా
● కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
● మూడు మండలాల్లో
అవగాహన సదస్సులు
కమ్మర్పల్లి/మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ నూతన ఆర్వోఆర్ ( రికార్డ్ ఆఫ్ రెవెన్యూ) చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండల కేంద్రాల్లో భూ భారతి చట్టంపై గురువారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టంలోని అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు క్షుణ్ణంగా వివరించారు. వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తెచ్చిందన్నారు. రైతుల భూములకు భరోసా లభిస్తుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చనున్నట్లు తెలిపారు. మే మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో భూభారతి చట్టాన్ని అమలు చేస్తారని వెల్లడించారు. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో భూ భారతి చట్టంపై సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని కలెక్టర్ చెప్పారు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. భూ వివాదాల విషయంలో అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సమకూరుస్తారని చెప్పారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాదిలోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు.
సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ..
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభా రతి ద్వారా మూడంచెల వ్యవస్థ ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. రైతులకు వారి భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులను కేటాయిస్తారన్నారు. వ్యవసాయ భూములతోపాటు, వ్యవసాయేతర, మిగతా అన్ని రకాల భూముల వివరాలు రెవెన్యూ కార్యాలయంలో న మోదై ఉన్నాయన్నారు. ఇది వరకు ఉన్న ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ప్రస్తుతం రికార్డుల ని ర్వహణ ఉంటుందని తెలిపారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా ప రిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో ఏదై నా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలలో అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్లో ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను నవీకరణ చేస్తారని తెలిపారు. సదస్సులో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్లు ఆంజనేయులు, కృష్ణ, ఎంపీడీవో తిరుమల, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, డైరెక్టర్లు బూత్పురం మహిపాల్, లింగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, వ్యవసాయాధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించొద్దు
భూ సమస్యలు, లోటుపాట్ల సవరణ వంటి వాటి కోసం రైతులు మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దన్నారు. అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని పేర్కొన్నారు. అనంతరం ఆయా అంశాలపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. నూతన చట్టంలో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందనే దానిపై సలహాలు సూచనలు చేయవచ్చన్నారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం


