
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీల బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లు
ఆదిలాబాద్: రాఖీ పండుగతో పాటు వరలక్ష్మీ వ్రతం వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరుల కు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు అధికసంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అలాగే వరుస సెలవుల దృష్ట్యా ఉ ద్యోగులు, కుటుంబాలతో ఇతర ప్రదేశాలకు వె ళ్తుంటారు. ఈ కారణంగా రద్దీ ఉండడంతో ఆర్టీసీ స్పెషల్ బస్సుల ఏర్పాట్లు చేపట్టింది.
118 ప్రత్యేక బస్సులు
ఈనెల 8న వరలక్ష్మీవ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఈ క్ర మంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలా బాద్లోని వివిధ ప్రాంతాలకు 46 ప్రత్యేక బ స్సులు వేశారు. అలాగే 10, 11, 12 తేదీల్లో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ డిపోల నుంచి హైదరాబాద్కు 72 బస్సులు నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
రద్దీకి అనుగుణంగా బస్సులు
వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 118 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జేబీఎస్, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రధాన బస్స్టేషన్లలో ‘మే ఐ హెల్ప్ యూ’ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రీజియన్ పరిధిలోని బస్స్టేషన్ల నుంచి పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతాం.
– ఎస్.భవానీప్రసాద్,
ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్
పండుగకు సొంత గ్రామాలకు వెళ్లలేని మహిళలు తమ సోదరులకు రాఖీలను బుక్ చేసి పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. రీజియన్ పరిధిలో మూడు బస్టాండ్లు, 26 ఏజెంట్ కౌంటర్లలో ఈ సేవలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో రాఖీలతో పాటు మిఠాయిలు కూడా పంపించుకునే వెసులుబాటు కల్పించారు. బుకింగ్లో ఏవైన సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్టీసీ డిపోల పరిధిలో సెల్ నంబర్ 9154298531, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 9154298547, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో 9154298541, రీజినల్ మేనేజర్ కార్యాలయం సెల్ నంబర్ 9154298553లో సంప్రదించాలని కరీంనగర్ జోన్ కార్గో మేనేజర్ వెంకటనారాయణ సూచించారు.
అందుబాటులో రాఖీ బుకింగ్ కౌంటర్లు
ముందస్తు రిజర్వేషన్ ఇలా..
పండుగల దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారి కోసం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే www. tgsrtcbus. in వెబ్సైట్ ద్వారా బస్సుల సీట్లను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

రాఖీకి ఆర్టీసీ సిద్ధం