కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో.. | Womans Body Found in 10 Foot Pit | Sakshi
Sakshi News home page

కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..

Jun 21 2025 1:16 PM | Updated on Jun 21 2025 2:45 PM

Womans Body Found in 10 Foot Pit

ఫరీదాబాద్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. భర్త, అత్తామామల వేధింపులకు ఒక మహిళ బలయ్యింది. స్థానికంగా ఈ  ఉదంతం సంచలనం సృష్టించింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒక  వీధిలో 10 అడుగుల లోతైన గుంత నుంచి పోలీసులు ఒక మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ నివాసి తనూ(24)గా గుర్తించారు. ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్‌కు చెందిన అరుణ్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఈ ఉదంతంలో తను భర్త, మామ, అత్త, మరొక దగ్గర బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటిపక్కన  మురుగు కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో తనూను ఆమె భర్త, అత్తామామాలు పూడ్చిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

తనూకు 2023లో వివాహం జరిగిందని,  అనంతరం ఆమె అత్తవారింటిలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురైందని  ఆమె సోదరి ప్రీతి ఆరోపించింది. వివాహం జరిగిన వెంటనే తనూ భర్త అరుణ్, అతని తల్లిదండ్రులు బంగారు నగలు, డబ్బు డిమాండ్ చేశారని  పేర్కొంది. తాము వారి డిమాండ్లను తీర్చడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంకా  ఏదో కావాలని  తనూను వేధించారని ఆమె తెలిపింది. వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక తనూ పుట్టింటిలోనే నెల్లాళ్ల పాటు ఉందని, తరువాత ఆమెను తాము అత్తారింటికి  పంపామని అప్పటినుంచి తమ సోదరికి మరింతగా వేధింపులు పెరిగాయని ప్రీతి పేర్కొంది.

ఏప్రిల్ 23న తనూ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె అత్తమామలు తమకు  చెప్పారని, దీంతో ఆమెకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా, కాల్‌ కలవలేదని ‍ప్రీతి తెలిపారు. దీంతో తమకు మరింతగా అనుమానం పెరిగి, పోలీసులను ఆశ్రయించామన్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతలో తనూ ఇంటికి సమీపంలో ఆమె మామ గొయ్యిని తవ్వారు. దానికి మురుగునీటి పారుదలకు అని ఆయన చుట్టుపక్కల వారికి చెప్పాడు. అయితే ఆ తరువాత నుంచి తనూ కనిపించలేదు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు మీడియాతో మాట్లాడుతూ వారం రోజల  క్రితం  ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని,  వెంటనే పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారన్నారు. గుంతలో నుండి తనూ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు

Advertisement
 
Advertisement
Advertisement