లాకప్‌ డెత్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు | Washim court sentenced nine policemen to life in the 2011 custodial death | Sakshi
Sakshi News home page

లాకప్‌ డెత్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు

Jul 3 2026 4:27 PM | Updated on Jul 3 2026 4:40 PM

Washim court sentenced nine policemen to life in the 2011 custodial death

ముంబై: సుదీర్ఘ కాలం పాటు సాగిన ఒక కస్టోడియల్‌ డెత్ కేసులో మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడి లాకప్ డెత్‌కు కారణమైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

2011, మే 10వ తేదీ అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో పార్ధి సామాజిక వర్గానికి చెందిన బేగ్యా పవార్ (23) అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు వారి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పవార్ పోలీస్ కస్టడీలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

పోలీస్ స్టేషన్‌లో పవార్‌ను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్య పరీక్షలలో కూడా పవార్ శరీరంపై అనేక చోట్ల ఎముకలు విరిగినట్లు తేలడంతో, కస్టడీలో జరిగిన హింస నిజమేనని స్పష్టమైంది. ఘటన జరిగిన అనంతరం పవార్ తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పైనే ఆరోపణలు ఉండటంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరించారు.

Custodial death case

దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, పార్ధి సామాజిక వర్గ ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి నిస్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.బాధితుల ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును రాష్ట్ర సీఐడీకి అప్పగించింది. సీఐడీ దర్యాప్తు అధికారి లోతుగా విచారణ జరిపి, కస్టడీలో యువకుడిని తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని నిర్ధారిస్తూ కోర్టులో నివేదిక (చార్జ్‌షీట్) దాఖలు చేశారు.

గత 15 ఏళ్లుగా సాగిన ఈ కేసు విచారణ చివరకు ముగిసింది. నాటి రిసోడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మహాదేవ్ మాణిక్ ధాండేతో పాటు మరో ఎనిమిది మంది పోలీసులను కోర్టు దోషులుగా తేల్చింది. నిందితుల్లో ఇన్‌ఛార్జ్ ధాండేతో సహా ఇద్దరు పోలీసులు ఇప్పటికే సర్వీస్ నుండి రిటైర్ అయ్యారు. కాగా, కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే దోషులైన తొమ్మిది మందిని వాషిమ్ జైలుకు తరలించారు. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వారిని అమరావతి జైలుకు తరలించనున్నారు.

కోర్టు తీర్పుపై పవార్ వృద్ధ తల్లిదండ్రులు స్పందిస్తూ..15 ఏళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది అని ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ.. తన కొడుకు ఎలాంటి నేరం చేయలేదని, కేవలం ప్రశ్నించడానికే తీసుకెళ్లి చంపేశారని పవార్ తల్లి కన్నీరు మున్నీరైంది. నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన కోర్టుకు, ప్రాసిక్యూషన్‌కు, సీఐడీ దర్యాప్తు బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement