
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్ల(Traffic Challans) చెల్లింపు విషయంలో కేంద్రం కీలక సవరణలను ప్రతిపాదించింది. దీని ప్రకారం.. 45 రోజుల్లోగా చలాన్లు కట్టాలి.. వాహనాలపై ఐదుకు మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్స్ సైతం రద్దు కావచ్చు. ఇకపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే.
వివరాల ప్రకారం.. సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో(Motor Vehicles Act) కేంద్ర రవాణాశాఖ ఈ కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ క్రమంలో చలాన్లపై చర్యల విషయమై కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది.
కొత్త రూల్స్ ప్రకారం..
👉ఎంవీ(మోటారు వెహికిల్) యాక్టు ప్రకారం.. ఒక వాహనంపై ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు ఉంటే.. డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అథార్టీ సస్పెండ్ చేసే అధికారం ఉంది.
👉అంతేకాకుండా లైసెన్స్ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా అలాగే కొనసాగుతాయి.
👉కొత్త నిబంధనల ప్రకారం.. చలాన్ చెల్లింపు గడువును 45 రోజుల్లో కట్టాల్సిందే. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ చెల్లించాలి.
👉చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.
👉ఒకవేళ చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే.. సదరు వాహనంపై రవాణాశాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు.
👉ఈ కారణంగా వాహనం అమ్మకం, కొనుగోలు వంటి జరగలేవు. లైసెన్సులో చిరునామా, పేరు మార్పుతోపాటు రెన్యువల్ కూడా కుదరదు.
👉ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి.
👉కొత్త రూల్ ప్రకారం.. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే.. డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడు అవుతారు.
అభ్యంతరాల స్వీకరణ..
కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. comments-morth@gov.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చని సూచించింది.