సుప్రీం కోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ | Set Back For TMC in Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ

May 2 2026 11:00 AM | Updated on May 2 2026 11:25 AM

Set Back For TMC in Supreme Court

సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై అభ్యంతరాలతో ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. మైక్రో అబ్జర్వర్లు ఎంపిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కోర్టు పూర్తిగా సమర్థించింది. 

‘‘ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పని చేస్తారు. వారికి ఎలాంటి విధేయతలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంలో తప్పేముంది?. ఆ ఎంపికలో పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను ఈసీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారంలో రాజకీయం చేయడం తగదు’’ అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. 

కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులను తప్పించి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించారంటూ ఈసీపై టీఎంసీ ఆరోపణలకు దిగింది. అయితే ఈసీ ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. కేంద్ర ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులు కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. అయినప్పటికీ టీఎంసీ పార్టీ శుక్రవారం కోల్‌కతా హైకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. 

అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్‌ వేశారు. అయితే ఇక్కడ కూడా మమతా బెనర్జీకి బిగ్‌ షాకే తగిలింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదుకాగా.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోలేదు. అయితే రెండో విడత పోలింగ్‌ తర్వాత అధికార టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ధర్నాకు దిగింది. అయితే ఆ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement