బెంగళూరులోకోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన దంపతులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీ బాధితుడి నుంచి దగ్గరినుంచి లక్షల్లో వసూలు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులో కిచ్చింది. ఇలా కోట్ల రూపాయలు దండుకున్న వైనం దిగ్భ్రాంతి రేపింది.
ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన జేసన్ డిసౌజా, లవీనా దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసి సుమారు రూ.25 కోట్ల మేర దండుకున్నారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిరుద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులే లక్ష్యంగా వీరు వల విసిరారు. వివిధ కోర్టుల్లో 'డి-గ్రూప్' ఉద్యోగాలు ఇప్పిస్తామని వందలాదిమందిని నమ్మించారు. ఒక్కో బాధితుడి నుంచి రూ.10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
అంతేకాదు బాధితులను నమ్మించేందుకు జడ్జీల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ నియామక పత్రాలను (Appointment Orders) కూడా తయారు చేశారు. తమ నెట్ వర్క్ను విస్తరించుకునేందుకు పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వీరి దందా కోసం నియమించుకున్న ఏజెంట్లు బాధితులను వెతికి పట్టుకుని, వారిని ఒప్పించి డబ్బులు వసూలు చేసేవారు. ఇందులో ఏజెంట్లు తమ కమిషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని దంపతులకు ఇచ్చేవారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరుతో బాధితులను ప్రైవేట్ హోటళ్లకు పిలిపించేవారు. అక్కడ నకిలీ ఆఫర్ లెటర్లను చూపించి ఇది అసలైన రిక్రూట్మెంట్ అని నమ్మించి డబ్బులు వసూలు మొత్తం గుంజేవారు. డబ్బులు తీసుకున్న తర్వాత బాధితులు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని అడిగితే, రకరకాల సాకులు చెప్పి చివరకు ఫోన్ నంబర్లు మార్చేసేవారు.
తాము నిండా మునిగిపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. అదేంటి అంటే ఈ దంపతులు ఇదే తరహా ఉద్యోగ మోసాల కేసులో 2024లో కూడా అరెస్ట్ అయ్యారు. జైలు నుండి విడుదలైన తర్వాత మళ్లీ అదే దందాను మొదలుపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన CCB పోలీసులు వీరిని అరెస్ట్ చేసి. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే విషయంపై విచారణ జరుపుతున్నారు.


