పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్‌.. కారణం ఏంటంటే | Punjab Groom Arrested For Having Over 100 People At Reception | Sakshi
Sakshi News home page

పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్‌.. కారణం ఏంటంటే

Apr 26 2021 8:57 PM | Updated on Apr 26 2021 8:59 PM

Punjab Groom Arrested For Having Over 100 People At Reception - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు 50 మందికి మించి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ నవ వరుడిని వివాహం అయిన గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంతకు అతడు చేసిన నేరం ఏంటంటే.. వివాహం అనంతరం సదరు వరుడి కుటుంబ సభ్యులు జలంధర్‌లోని ఓ ఆలయంలో రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ వేడుకకు సుమారు 100 మంది హాజరయ్యారు.

దీని గురించి పోలీసులకు తెలియడంతో వారు వరుడితో పాటు అతడి తండ్రి మీద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వరుడు చెప్పిన విషయం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. రిసెప్షన్‌ వేడుకకు వచ్చిన వారిలో చాలా మంది తమకు తెలియదన్నారు. అసలు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో తమకు తెలియదని వాపోయాడు. ఇక వేడుకకు వచ్చిన వారిని వెళ్లిపోమ్మని చెప్పడం బాగుండదని.. అందుకే తాము మౌనంగా ఉన్నామన్నారు. ఇక రిసెప్షన్‌ వేడుకకు హాజరైన వారిలో కొందరు పోలీసులును చూసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. 

ఈ సందర్భంగా జలందర్‌ డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ.. ‘‘సదరు వరుడు, అతడి కుటుంబ సభ్యులు వారాంతపు కర్ఫ్యూని ఉల్లంఘించారు. అంతేకాక ఫంక్షన్‌ నిర్వహించడానికి ముందు మా వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే వారి మీద ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశాం’’ అన్నారు. కరోనా కట్టడి కోసం పంజాబ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తుంది. దాంతో పాటు జిమ్‌లు, సినిమా హాళ్లు, పార్కులు, కోచింగ్‌ సెంటర్లు, క్రీడా సముదాయాలు మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివాహాలు, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతిచ్చింది. దహన సంస్కారాలకు కేవలం 10మందికి మాత్రమే అనుమతి. మినహాయించిన దానికన్నా ఎక్కువ మందితో నిర్వహించే కార్యక్రమాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. 

చదవండి: వైరల్‌: ‘ఆక్సిజన్‌ కావాలంటే ఈ నాయకులకు కాల్‌ చేయండి’

Advertisement
 
Advertisement
Advertisement