ఢిల్లీ: అరేబియా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ఓ నౌక భారత నౌకను ఢీకొట్టింది. దీంతో భారత్ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్ దౌత్యవేత్తతో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నౌకాదళ ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదిగా ఉందని వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.
ఈ ఘటనపై పాకిస్థాన్ తాత్కాలిక రాయబారి సాద్ అహ్మద్ వరిచ్తో భారత విదేశాంగ శాఖ పలు అంశాలను ప్రస్థావించింది. పాకిస్థాన్ నౌకాదళం వ్యవహరించిన తీరు 1991లో భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన పరస్పర ఒప్పందంలోని ఆర్టికల్ 10కు పూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొంది. “ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న సంబంధిత ఒప్పందాల నిబంధనలను గౌరవించాలి” అని తెలిపింది. భారత్ వ్యక్తం చేసిన ఈ సందేశాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా తెలియజేయాలని పాక్ దౌత్యవేత్తను ఆదేశించింది.
ఎలా జరిగింది
ఈ ఘటన సెప్టెంబర్ 15 ఒమన్కు తూర్పుగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకాదళానికి చెందిన ఓ ఫ్రంట్లైన్ యుద్ధనౌకకు పాకిస్థాన్ నౌకాదళ నౌక సమీపంగా వచ్చింది. అనంతరం ఢీకొట్టింది. నౌకను నడపడంలో నిర్లక్షంగా వ్యవహరించడం కారణంగానే రెండు నౌకలు ఢీకొన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు
అయితే కేవలం నౌకలు ఢీకొట్టడం మాత్రమే కాకుండా అంతర్జాతీయ జలాల్లో సైనిక నౌకలు వ్యవహరించే సమయంలో పాటించాల్సిన భద్రత, జాగ్రత్తలు, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సంబంధిత ఒప్పందాల నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని భారత్ ప్రస్తావించింది. ముఖ్యంగా, 1991 నాటి భారత్-పాకిస్థాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 10ను పాకిస్థాన్ నౌకాదళ నౌక ప్రవర్తన ఉల్లంఘించిందని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటన పునరావృతం కాకుండా ఇరు దేశాల సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరస్పరం కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించాలని భారత్ స్పష్టం చేసింది.


