
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో రెండేళ్లుగా యాక్టివ్గా ఉన్న ఈ ముష్కరులు.. భారత భద్రతా దళాలపై జరిగిన మూడు ప్రధాన దాడులలో పాల్గొన్నారనే అనుమానాలున్నాయి.
పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి. ఈ ఉగ్రవాదులు పూంచ్లోని డెహ్రా కి గలి (డీకేజీ) ద్వారా భారత్లోనికి చొరబడి 2022 చివర లేదా 2023 ప్రారంభం నుండి జమ్ముకశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యింది. జమ్ము ప్రాంతంలో ఒక సంవత్సరానికి పైగా చురుకుగా ఉన్న ఈ బృందం 2024 ద్వితీయార్థంలో భారత భద్రతా దళాలపై దాడులకు తెగబడిందని తెలుస్తోంది.
ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పూంచ్లోని సురాన్కోట్లోని బుఫ్లియాజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో పాల్గొంది. నాటి దాడిలో నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. 2024 మేలో బక్రాబల్ మొహల్లా వద్ద భారత వైమానిక దళ కాన్వాయ్పై జరిగిన మెరుపుదాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. పూంచ్లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలలో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బృందం 2024లో కశ్మీర్కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ దాడికి ముందు వీరు సమావేశమయ్యారని దర్యాప్తులో వెల్లడయ్యింది.
ఇది కూడా చదవండి: ఇరాన్కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్ ఆగ్రహం