సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్(38) హఠాన్మరణం చెందాడు. ప్రతీక్ అఖిలేష్ యాదవ్కు సవతి సోదరుడు.
ప్రతీక్ అనారోగ్యంతో కొన్ని వారాల కిందట ఆస్పత్రిలో చేరారు. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ వేకువజామున ప్రతీక్ మరోసారి అస్వస్థతకు గురి కాగా.. లక్నోలోని ఓ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే చికిత్స కంటే ముందే ఆయన మరణించినట్లు వైధ్యులు ప్రకటించారు. ఆయన మృతికి గల కారణంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ములాయం సింగ్ మొదటి భార్య మాలతి దేవి తనయుడు అఖిలేష్ యాదవ్. ప్రతీక్ యాదవ్ ములాయం రెండో భార్య సాధనా గుప్తా తనయుడు. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ (UK)లో చదువుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు. లక్నోలో “ది ఫిట్నెస్ ప్లానెట్” పేరిట ఓ జిమ్ కూడా నడిపారు. జీవ్ ఆశ్రయ్ అనే సంస్థ ద్వారా వీధి కుక్కల సంరక్షణ, ఇతర పశు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు.

బీజేపీ నేత, యూపీ మహిళా కమిషన్ వైస్ చైర్పర్సన్ అపర్ణా యాదవ్ ప్రతీక్ భార్య. ఆమె 2022లో బీజేపీలో చేరినప్పటి నుంచి ఆ కుటుంబంలో రాజకీయ విబేధాలు మొదలయ్యాయి. అయితే ఆ అన్నదమ్ముల మధ్య మాత్రం బంధం వ్యక్తిగతంగా కొనసాగేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


