
లండన్: దాయాది దేశం పాకిస్తాన్పై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది విరుచుకుపడ్డారు. భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తే పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం టాప్ 20(టీ20) ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ బుద్ధి ఎలాంటి అంటే.. మనం వారితో కరచాలనం చేసి ఇటు వైపు తిరిగిన వెంటనే.. మన వెనుక నుంచి దాడి చేస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆపరేషన్ సిందూర్పై వివరణ, పాక్ దౌత్యపరంగా దెబ్బతీసేందుకు అఖిలపక్ష బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం లండన్కు చేరుకుంది. ఈ అఖిలపక్ష బృందంలో శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది సభ్యులుగా ఉన్నారు. తాజాగా లండన్లో ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తే.. పాకిస్తాన్ మాత్రం టాప్ 20(టీ20) ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇదీ వారి విధానం. జీ-20 అధ్యక్ష పదవిలో భారత్ ఒక ఏడాది పాటు కొనసాగింది. ఈ సమయంలో అధ్యక్ష పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాం.
ఇదే సమయంలో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ప్రస్తావన తెచ్చారు. ఈ క్రమంలో ప్రియాంక మాట్లాడుతూ.. బిన్ లాడెన్ గురించి ఇక్కడున్న వారిలో ఎంత మందికి తెలుసు. మీలో ఎంత మంది లాడెన్ డాక్యుమెంటరీ చూశారో నాకు తెలియదు. ఒక్కసారి లాడెన్ డాక్యుమెంటరీ చూడండి. పాకిస్తాన్ ఎంత సాయం చేసిందో తెలుస్తుంది. అల్ ఖైదాకు నిధులు ఇచ్చారు.. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలో జరిగిన దాడుల సూత్రధారి లాడెన్. ఈ దాడి తర్వాత లాడెన్ పాకిస్తాన్లో దాక్కున్నాడు అని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా పాకిస్తాన్కు తగిన బుద్ది చెప్పాలని కోరారు.
#WATCH | London, UK | Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "...We had a very successful presidency of G-20... While we host the G-20, Pakistan hosts the T-20. The top 20 terrorists of the world will be found being hosted by the Pakistani state government. It's their… pic.twitter.com/c8njvaCYRS
— ANI (@ANI) June 1, 2025