ప్రేమగా లాలించిన ప్రధాని మోదీ
అధికారిక నివాసంలో ప్రత్యేక అతిథి
న్యూఢిల్లీ: నిత్యం ఎన్నో అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, చర్చలతో క్షణం తీరకలేకుండా గడిపే ప్రధాని మోదీని ఒక ప్రత్యేక అతిథి అన్ని పనులూ పక్కనబెట్టిమరీ అతనితోనే ఆడుకునేలా చేశాడు. అతనే కేరళకు చెందిన ఓమీ. సీనియర్ మలయాళీ నటుడు కృష్ణకుమార్ తన కుమార్తెలు అహానా, దియా (ఓజీ), ఇషానా, హన్సికలతో పాటు శుక్రవారం మోదీని కలిశారు. ఓజీ తన కుమారుడు ఓమీని సైతం వెంట తీసుకొచ్చారు.
ఓమీని మోదీ చాలాసేపు ఎత్తుకుని ఆడిస్తూ గడిపారు. సదరు ఫొటో వైరల్గా మారింది. దాన్ని మోదీ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయగా ఏకంగా లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఓమీ తల్లి ఓజీ తన ఆనందాన్ని ఒక పోస్టులో పంచుకున్నారు. ‘‘ప్రధానితో గడిపిన ఆనందమయ క్షణాలను మర్చిపోం. మోదీజీకి మేమెప్పుడూ పెద్ద అభిమానులం’’ అన్నారు. ‘‘అంతటి నాయకుడు బేషజాల్లేకుండా మమ్మల్ని సాదరంగా ఆహా్వనించి ఆప్యాయంగా మాట్లాడారు. అత్యున్నతమైన నేత సమక్షంలో ఉన్నామని మర్చిపోయేలా చేశారు. ఈరోజు మాకెంతో ప్రత్యేకం’’ అని అహానా కూడా ఒక పోస్ట్ పెట్టారు.


