డీకే సీఎం అయ్యేది అప్పుడే: సిద్దరామయ్య | Karnataka power breakfast DK Shivakumar to host CM | Sakshi
Sakshi News home page

డీకే సీఎం అయ్యేది అప్పుడే: సిద్దరామయ్య

Dec 2 2025 8:14 AM | Updated on Dec 2 2025 12:32 PM

Karnataka power breakfast DK Shivakumar to host CM

బెంగళూరు: కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా సీఎంకు డీకే, ఆయన సోదరుడు డీకే సురేష్‌ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అల్పాహారంలో నాటుకోడి చికెన్‌, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు.

బ్రేక్‌ ఫాస్ట్‌ అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం. హైకమాండ్‌ ఎప్పుడు ఆదేశిస్తే శివకుమార్‌ అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. హైకమాండ్‌, రాహుల్‌ గాంధీ ఆదేశాలను మేము పాటిస్తాం. రేపు డీకే, నేను కేసీ వేణుగోపాల్‌ను కలుస్తాం. మేము కలిసే ఉన్నాం. మా మధ్య విభేదాలేమీ లేవు. మేమంతా కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. భవిష్యత్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. 

ఇక, అంతకుముందు.. సీఎం సిద్దరామయ్యను మంగళవారం బ్రేక్‌ ఫాస్టుకు ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్‌..‘కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి, ముఖ్యమంత్రిని రేపు బ్రేక్‌ఫాస్ట్‌కి ఆహ్వానించాను’ అని రాసుకొచ్చారు. 

డిప్యూటీ సీఎం ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య సదాశివనగర్‌లోని నివాసానికి రాగా.. బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్‌ ఆయన్ను సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ దీనిని పదేపదే ఖండిస్తున్నా.. ఈ అంశం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.

కర్ణాటకలో ఆసక్తికరంగా మారిన బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్

అయితే, గత శనివారమే వీరిద్దరూ సిద్ధరామయ్య ఇంట్లో సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ప్రకటించారు. అధిష్ఠానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement