‘ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పండి’ | Karnataka HC Ask MLC Ravi To Apology IAS Fouzia Taranum | Sakshi
Sakshi News home page

Fouzia Taranum: మీరేం అతీతులు కాదు.. ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పండి

May 30 2025 10:26 AM | Updated on May 30 2025 11:38 AM

Karnataka HC Ask MLC Ravi To Apology IAS Fouzia Taranum

బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌ రవికుమార్‌ ఐఏఎస్‌ అధికారిణి ఫౌజియా తరన్నుమ్‌ (Fouzia Taranum)పై చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు మండిపడింది. ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన్ని ఆదేశించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఓ కార్యక్రమంలో.. సీనియర్‌ ఐఏఎస్‌ ఫౌజియాను ఉద్దేశించి ‘పాకిస్తానీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  ఈ వ్యాఖ్యలకుగానూ ఆయనపై కేసు కూడా నమోదయ్యింది.

అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ రవికుమార్‌ హైకోర్టును (Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూరజ్‌ గోవిందరాజ్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సుప్రీం కోర్టు ఎలా స్పందించిందో మీరూ చూశారు. కాబట్టి మీరేం అందుకు అతీతులు కారు. మీరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. కాబట్టి మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పండి’’ అని ధర్మాసనం రవికి స్పష్టం చేసింది.

మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందంటే.. 
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మీడియాకు కర్నల్‌ సోఫియా ఖురేషీ (Sofiya Qureshi) ఆ వివరాలను వెల్లడించారు. అయితే.. మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కున్వర్‌ విజయ్‌ షా (Kunwar Vijay Shah) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని (సోఫియా ఖురేషీని ఉద్దేశించి) సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆయనపై కేసు నమోదుకు పోలీసులను ఆదేశించగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  అయితే..

చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టింది. పదవిలో ఉంటూ అవేం మాటలంటూ మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు క్షమాపణలు తెలియజేయగా.. ఆపై ద్విసభ్య ధర్మాసనం వాటిని అంగీకరించ లేదు. ఏదో మొక్కుబడిగా క్షమాపణలు చెప్పారని.. మొసలి కన్నీరు కార్చరని మళ్లీ ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో  ఈ వ్యవహారంపై కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు సమగ్ర నివేదికను కోర్టు కోరింది. అయితే అరెస్ట్‌ నుంచి మాత్రం కున్వర్‌కు ఊరట ఇచ్చిన న్యాయస్థానం.. తాజాగా ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

కర్ణాటకలో ఏం జరిగిందంటే..
బీజేపీ సీనియర్‌ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి (Chalavadi Narayanaswamy)  ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే (ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ..  ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్‌ హౌజ్‌ వద్ద నిరసనలు తెలిపారు. అయితే..

అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్‌‌ ఫౌజియా తరన్నుమ్‌ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్‌ (MLC N Ravikumar) పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్‌ ఇక్కడ ఐఏఎస్‌ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్‌ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్‌ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్‌ వ్యాఖ్యానించారు.

మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్‌లో ఫిర్యాదు నమోదు కాగా.. రవికుమార్‌పై కేసు ఫైల్‌ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్‌ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలో తాను ఏదో భావోద్వేగంలో అలా అనేశానంటూ వివరణచ్చారు. 

మరోవైపు.. రవికుమార్‌పై చర్యలు కోరుతూ గురువారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలంతా  గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఫౌజియా నిరాకరించారు. 

ఇదీ చదవండి: మస్క్‌ ఎగ్జిట్‌పై స్పందించిన ట్రంప్‌, ఏమన్నారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement