ఘాజీపూర్: ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పరిధిలో గల సైద్పూర్లో ఒక చిన్న పాన్షాప్ నడుపుకుంటున్న సురేంద్ర కశ్యప్ ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు రూ. 1.12 లక్షల విద్యుత్ బిల్లు బకాయిలు, వాటి వసూళ్ల కోసం అధికారులు పెట్టిన తీవ్ర ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ అనుపమ్ శుక్లా స్వయంగా బాధితుడి ఇంటికి వచ్చి, కుటుంబాన్ని పరామర్శించారు.
విద్యుత్ అధికారుల వేధింపులే కారణమా?
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సురేంద్ర కశ్యప్ గత కొంతకాలంగా రూ. 1.12 లక్షల భారీ విద్యుత్ బిల్లు బకాయిల వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. రికవరీ సర్టిఫికేట్ ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని, ఆ వేధింపులు భరించలేకే సురేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డారని వారు కలెక్టర్కు వివరించారు. ఈ దారుణానికి కారణమైన అధికారులపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టం
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీఎం అనుపమ్ శుక్లా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. విచారణలో ఏ అధికారి లేదా ఉద్యోగి అయినా సరే, సదరు వ్యాపారిని మానసికంగా వేధించినట్లు తేలితే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా బాధితులను అన్ని విధాలా అండగా ఉంటామని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


