డీఏపీకి ‘గాజా’ దెబ్బ | Haryana farmers panic over DAP shortage | Sakshi
Sakshi News home page

డీఏపీకి ‘గాజా’ దెబ్బ

Nov 10 2024 5:20 AM | Updated on Nov 10 2024 10:29 AM

Haryana farmers panic over DAP shortage

మన రైతులను వేధిస్తున్న డీఏపీ కొరత 

దిగుమతులు తగ్గడమే ప్రధాన కారణం 

హరియాణాలో ఆందోళనలు తీవ్రతరం 

పంజాబ్, యూపీల్లోనూ ఇదే పరిస్థితి 

మధ్యప్రదేశ్, కర్నాటకల్లోనూ ఇక్కట్లే

ఎక్కడో జరిగిన చర్య ఇంకెక్కడో ప్రతి చర్యకు కారణమవుతుందంటారు.  హరియాణా రైతుల విషయంలో అది  నిజమవుతోంది. ఏడాదిగా సాగుతున్న  గాజా సంక్షోభం భారత్‌లో డీఏపీ కొరతకు  దారి తీస్తోంది. హరియాణా రైతులు  రోడ్డెక్కేందుకు కారణంగా మారుతోంది.  

హరియాణాలోని సిర్కా ప్రాంతంలో రైతులు వారం రోజులుగా రోడ్డెక్కుతున్నారు. రబీ సీజన్‌ వేళ తమకు సరిపడా డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్‌) ఎరువు సరఫరా చేయాలంటూ ఆందోళనకు దిగితున్నారు. పలు ఇతర జిల్లాల్లో కూడా రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద కొద్ది రోజులుగా బారులు తీరుతున్నారు. కొరత నేపథ్యంలో డీఏపీ మున్ముందు దొరుకుతుందో లేదోనని ఎగబడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేసేదాకా వెళ్లింది. 

పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఆవాలు, గోధుమ పంటల దిగుబడి బాగా రావాలంటే డీఏపీ తప్పనిసరి. ఆ మూడు రాష్ట్రాల్లో పంటలకు డీఏపీని విరివిగా వాడుతారు. పంటల నత్రజని, సల్ఫర్‌ అవసరాలను డీఏపీ బాగా తీరుస్తుంది. ఆ రాష్ట్రాల రైతులను డీఏపీ కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధంతో ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు డీఏపీ సరఫరాలో ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి. గాజాలో ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం దెబ్బకు ప్రపంచ సరకు రవాణా గొలుసు అక్కడక్కడా తెగింది. దాంతో ఎరువుల దిగుమతిపై ఆధారపడిన భారత్‌ వంటి దేశాలకు కష్టాలు పెరిగాయి. 

ఏటా 100 లక్షల టన్నులు 
భారత్‌ ఏటా 100 లక్షల టన్నుల డీఏపీని వినియోగిస్తోంది. వీటిలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్నాటకల్లోనూ డీఏపీ వాడకం ఎక్కువే. డీఏపీ లోటు ప్రస్తుతం ఏకంగా 2.4 లక్షల మెట్రిక్‌ టన్నులను దాటింది. దాంతో సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో డీఏపీ కష్టాలు మరింత పెరిగాయి. హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం పశ్చిమాసియాలో విస్తరించి ఇరాన్, లెబనాన్, హెజ్‌»ొల్లా, హూతీలు ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఎర్రసముద్రంలో ఉద్రిక్తత పెరిగి అతి కీలకమైన ఆ అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా సరకు రాకపోకలు బాగా తగ్గాయి. 

సరఫరాలపై హౌతీల దెబ్బ! 
సరకు రవాణా విషయంలో ఎర్రసముద్రం చాలా కీలకం. మద్యధరా సముద్రాన్ని సూయాజ్‌ కాల్వ ద్వారా హిందూ మహాసముద్రంతో కలిపేది అదే. అలాంటి ఎర్ర సముద్రంపై యెమెన్‌లోని హౌతీలు పట్టుసాధించారు. నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారారు. వాటిపై తరచూ దాడులకు తెగబడుతుండటంతో ఎర్రసముద్రం మీదుగా సరకు రవాణా బాగా తగ్గిపోయింది. 

దగ్గరి దారి అయిన సూయాజ్‌ ద్వారా రావాల్సిన సరకు ఆఫ్రికా ఖండాన్నంతా చుడుతూ కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ మీదుగా తిరిగి రావాల్సి వస్తోంది. అలా ఒక్కో నౌక అదనంగా ఏకంగా 6,500 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా సరకు డెలివరీ చాలా ఆలస్యమవుతోంది. కేంద్రం దీన్ని ముందుగానే ఊహించింది. సెప్టెంబర్‌–నవంబర్‌ సీజన్‌లో ఎక్కువ ఎరువును అందుబాటు ఉంచాలని భావించినా ఆ స్థాయిలో సరకు దిగుమతి కాలేదు. దాంతో డీఏపీ కొరత అధికమైంది. భారత్‌ 2019–20లో 48.7 లక్షలు, 2023–24లో 55.67 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీని దిగుమతి చేసుకుంది. 

ప్రత్యామ్నాయంగా ఎన్‌పీకే 
డీఏపీకి బదులు నైట్రోజన్, పాస్ఫరస్, పొటా షియం (ఎన్‌పీకే) ఎరువును వాడాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. హరియాణాకు 60,000 మెట్రిక్‌ టన్నుల ఎన్‌పీకే కేటాయించామని, అందులో 29,000 టన్నులు రైతులకు అందిందని చెబుతోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడే డీఏపీ కొరత తప్పదన్న భయాందోళనలు తలెత్తాయి. గాజా సంక్షోభం పుణ్య మా అని అవి తీవ్రతరమవుతున్నాయి.

ధరాభారం కూడా... 
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్‌ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. 

హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్‌ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం.

ధరాభారం కూడా... 
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్‌ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. 

హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్‌ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం. 

Advertisement
 
Advertisement
Advertisement