మీరు ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా? | Do you know why you cant buy a house | Sakshi
Sakshi News home page

మీరు ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా?

Sep 16 2026 5:25 PM | Updated on Sep 16 2026 5:47 PM

Do you know why you cant buy a house

మీరు ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా? దేశంలో ఇళ్లు లేవని కాదు.. మీ ఆదాయానికి అందుబాటులో ఉండే ఇళ్లు తగ్గిపోతున్నాయి. డెవలపర్లు అధిక ధరల ఇళ్ల నిర్మాణంపై ఎక్కువగా దృష్టి పెడుతుండగా, భూమి, నిర్మాణ సామగ్రి, కార్మిక వ్యయాలు పెరగడం వల్ల తక్కువ ధరలో ఇళ్లు నిర్మించడం వారికి కష్టంగా మారుతోంది. ఫలితంగా ఒకవైపు లక్షల ఇళ్లు అమ్ముడుకాక మిగిలిపోతుండగా, మరోవైపు సామాన్యులు కొనగలిగే ధరలో ఇల్లు దొరకడం కష్టమవుతోంది.

భారత్‌లోని ఏడు ప్రధాన గృహ మార్కెట్లలో 6 లక్షలకు పైగా ఇళ్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో అందుబాటు ధరలో ఇల్లు కొనడం యువతకు సవాలుగా మారింది. ఇళ్ల కొరతతో పాటు విక్రయించని ఇళ్లు ఒకేసారి కనిపించడానికి ప్రధాన కారణం అవసరమైన ఇళ్లకు, నిర్మిస్తున్న ఇళ్ల రకాలకు మధ్య పెరుగుతున్న అంతరమే.

ఎన్రాక్‌ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య దేశంలోని ఏడు ప్రధాన గృహ మార్కెట్లలో సుమారు 97,000 ఇళ్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో డెవలపర్లు సుమారు 1.06 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గగా, కొత్త ఇళ్ల ప్రారంభాలు 7 శాతం పెరిగాయి. జూన్‌ చివరికి ఈ ఏడు నగరాల్లో 6.16 లక్షలకు పైగా ఇళ్లు విక్రయానికి మిగిలాయి. ప్రస్తుతం జరుగుతున్న విక్రయాల వేగాన్ని చూస్తే ఈ పూర్తయిన కొత్త కొత్త ఇళ్లను పూర్తిగా విక్రయించడానికి సుమారు 19 నెలలు పడుతుందని అంచనా.

అయితే అన్ని నగరాల్లో పరిస్థితి ఒకేలా లేదు. బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మహానగర ప్రాంతాల్లో త్రైమాసికంలో అమ్మిన ఇళ్ల కంటే కొత్తగా నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్‌, చెన్నైలో మాత్రం కొత్తగా నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు అమ్ముడయ్యాయి.

ఎన్రాక్‌ ఏడు టాప్‌ నగరాల గణాంకాల ప్రకారం.. రూ.2.5 కోట్లకు పైబడిన ఇళ్లు 22 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.40 లక్షల కంటే తక్కువ ధర గల ఇళ్ల వాటా కేవలం 6 శాతంగా ఉంది. అంటే ఇల్లు కావాలనుకునే వారి అవసరాలకు, డెవలపర్లు నిర్మిస్తున్న ఇళ్లకు మధ్య ధర పరంగా పెద్ద అంతరం ఉంది.

గృహ నిర్మాణ వ్యయాలు పెరిగాయ్‌ 
గృహ నిర్మాణ వ్యయాలు పెరగడం దీనికి ఒక కారణంగా కనిపిస్తోంది. భూమి, ఉక్కు, సిమెంట్‌, కార్మిక వ్యయాలు అధికమయ్యాయి. అనుమతుల్లో ఆలస్యం అయితే ఆర్థిక వ్యయాలు మరింత పెరుగుతున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం అందుబాటు గృహ ప్రాజెక్టుల్లో డెవలపర్ల లాభ మార్జిన్‌ సుమారు 10-12 శాతం ఉండగా, ప్రీమియం, విలాసవంతమైన ప్రాజెక్టుల్లో అది 25-30 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు.

అధికారికంగా అందుబాటు గృహం ధర రూ.45 లక్షలకు మించకూడదనే పరిమితి ఉంది. అయితే ముంబైలో రూ.45 లక్షలకు లభించే ఇల్లు, ఇండోర్‌, లక్నో నగరాల్లో అదే మొత్తానికి లభించే ఇంటితో సమానం కాదు. ఇల్లు నిజంగా అందుబాటులో ఉందా అనేది ధరతో పాటు ప్రారంభ చెల్లింపు, నెలవారీ ఈఎంఐ, రుణ కాలం, పని ప్రదేశానికి ప్రయాణ ఖర్చులపై కూడా ఆధారపడి ఉంటుంది.

ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ 2.0 ద్వారా ఐదేళ్లలో మరో కోటి అర్హత కలిగిన పట్టణ కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో వివిధ ప్రాజెక్టుల్లో 1.25 కోట్లకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని, కోటికి పైగా పూర్తై లబ్ధిదారులకు అందించామని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వ పథకాలు మాత్రమే పట్టణ గృహ మార్కెట్‌ సమస్యను పరిష్కరించలేవు.

అందుబాటు గృహాల నిర్వచనాన్ని స్థానిక భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, ఆదాయాలకు అనుగుణంగా మార్చడం, నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం, వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక వసతులు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు వంటి చర్యలు అవసరం. అదే సమయంలో అద్దె గృహ మార్కెట్‌ను కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. చివరికి గృహ మార్కెట్‌ విజయాన్ని ఎన్ని ఇళ్లు నిర్మించారన్నదానికంటే, ఇల్లు అవసరమైన ప్రజలు వాటిలో నిజంగా నివసించగలిగే స్తోమత కలిగి ఉన్నారా అన్నదే నిర్ణయించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement