సాక్షి బెంగళూరు: సోషల్ మీడియా వేదికగా ఇటీవల పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి కన్నడనాడు కర్ణాటకలో కూడా మద్దతుదారులు పెరిగారు. ఏకంగా రాష్ట్ర మంత్రులు సైతం ఈ ఆన్లైన్ పోర్టల్కు మద్దతు ప్రకటించారు. దేశ సమస్యలపై కేంద్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో యువతలో పెల్లుబికిన ఆగ్రహమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ’ అని మంత్రి శరణ ప్రకాశ్ పాటిల్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నిరుద్యోగం, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ తదితర కారణాల వల్ల యువత ఆగ్రహంతో ఉంది. వారి సమస్యలపై కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు.
మరో మంత్రి సంతోష్ లాడ్ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. యువత డిజిటల్ పోరాటంపై తనకు సంతోషంగా ఉందని, ఇలాంటి పోరాటం ప్రస్తుతం అవసరమని, తన మద్దతు కచ్చితంగా ఉంటుందని చెప్పారు. అలాగే సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ పార్టీకి అనుకూలంగా చాలా మంది వీడియోలు, పోస్టులు పెడుతున్నారు.
ఈ నెల 24న కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత మానవహారాన్ని నిర్వహిస్తోందంటూ ఒక పోస్టర్ షేర్ అవుతోంది. బెంగళూరు టౌన్హాల్ ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు ఆందోళన చేపడుతున్నట్లు ఆ పోస్టర్లో పేర్కొన్నారు. యువతకు భవిష్యత్తు లేదని, ధరల పెరుగుదల, నీట్ పేపర్ లీకేజీ, ఓట్ల చోరీ తదితర అంశాలపై యువత పోరాటం అనే పేరిట ఈ పోస్టర్ ప్రచురితమైంది.


