పండంటి కాపురంలో ఫోన్‌ పెట్టిన చిచ్చు | Married Woman Killed Her Sons Later She Committed Suicide Over Angry With Her Husband In Chennai | Sakshi
Sakshi News home page

పండంటి కాపురంలో ఫోన్‌ పెట్టిన చిచ్చు

Dec 23 2024 11:54 AM | Updated on Dec 23 2024 1:50 PM

Chennai Woman Life End after Slitting Sons

నాలుగేళ్ల కుమారుడిపై హత్యాయత్నం 

తర్వాత తల్లి ఆత్మహత్యా యత్నం 

చెన్నై పుల్లాపురంలో దారుణం  

సాక్షి, చెన్నై : భర్తపై కోపంతో ఓ వివాహిత ఏడాదిన్నర వయస్సు కుమారుడి గొంతు కోసి హత్య చేసి, తర్వాత నాలుగేళ్ల కుమారుడి గొంతు కోసింది. చివరికి తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన చెన్నై పుల్లాపరంలో శనివారం కలకలం రేపింది. వివరాలు.. చెన్నై కీల్పాక్కం పుల్లాపురం 3వ వీధికి చెందిన దివ్య (32)కు ఆరేళ్ల క్రితం పెరుంగలత్తూర్‌కు చెందిన ప్రైవేటు కొరియర్‌ సంస్థ ఉద్యోగి రామ్‌కుమార్‌ (34)తో వివాహం జరిగింది. వీరికి లక్షణ్‌ కుమార్‌ (4), పునిత్‌ కుమార్‌ (ఒకటిన్నర సంవత్సరం) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పేదరికం కారణంగానూ, దివ్యా నిత్యం సెల్‌ఫోన్‌ సామాజిక మాధ్యమాలలో గడుపుతున్న కారణంగానూ భార్య భర్తల మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  

పుట్టింటికి వచ్చిన దివ్య.. 
ఈ క్రమంలో రెండు నెలల క్రితం భర్తతో గొడవ పడిన దివ్య ఇద్దరు కుమారులతో పుల్లాపురంలో ఉన్న పుట్టింటికి వచ్చేసింది. ఈ స్థితిలో శనివారం ఇద్దరు పిల్లలతో దివ్య ఒంటరిగా ఇంటిలో ఉన్న సమయంలో ఫోన్‌ చేసిన రామ్‌కుమార్‌ కాపురానికి రావాల్సిందిగా కోరగా, అందుకు ఆమె నిరాకరించడంతో ఫోన్‌లో ఇద్దరికి గొడవ జరిగినట్లు తెలుస్తోంది.  

అసహనంతో.. 
దీంతో తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్న దివ్య పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. వెంటనే భర్త మీద కోపంతో దివ్య ఇంటిలో ఉన్న తన చిన్న కుమారుడు పునిత్‌ కుమార్‌ను బాత్‌రూమ్‌లోకి తీసుకు వెళ్లి కూరలు నరికే కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. తర్వాత తన పెద్ద కుమారుడు లక్షణ్‌ను కూడా బాత్‌రూమ్‌లోకి తీసుకు వెళ్లి గొంతు కోసింది. అప్పుడు అతని అరుపులు విన్న దివ్య అత్త పద్మావతి అడ్డుకోవడంతో తీవ్ర ఆక్రోశంతో ఉన్న దివ్య తన గొంతు కోసుకుని పడిపోయింది. తర్వాత తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన బంధువులు దివ్యను, పెద్ద కుమారుడు లక్షణ్‌ను చికిత్స నిమిత్తం కీల్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

తల్లిపై హత్య, హత్యాయత్నం కేసు  
కీల్పాక్కం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పునీత్‌ కుమార్‌ మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు దివ్యపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దివ్య కోలుకున్న తర్వాత ఆమెను అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దివ్య గొంతు స్వరపెటిక తెగిపోవడంతో సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement