274కు పెరిగిన మృతుల సంఖ్య | Ahmedabad Plane Crash Deaths Rise To 274, the Air India Boeing 787 Dreamliner | Sakshi
Sakshi News home page

274కు పెరిగిన మృతుల సంఖ్య

Jun 15 2025 2:02 AM | Updated on Jun 15 2025 2:02 AM

Ahmedabad Plane Crash Deaths Rise To 274, the Air India Boeing 787 Dreamliner

మెడికల్‌ కాలేజీలో 33 మంది దుర్మరణం 

వారిలో ఐదుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు 

మరొకరు 14 ఏళ్ల స్థానిక బాలుడు 

మిగతా మృతుల వివరాలపై అస్పష్టత

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కు పెరిగింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అంతా దుర్మరణం పాలవడం తెలిసిందే. విమానం రన్‌వే సమీపంలోని బీజే మెడికల్‌ కాలేజీ క్యాంటీన్, బాయ్స్‌ హాస్టల్‌ భవనాలపై పడి పేలిపోవడమే గాక మరో రెండు పరిసర భవనాలకు కూడా నిప్పంటుకుంది. దాంతో వాటిలో ఉన్నవారిలోనూ చాలామంది చనిపోయారు. వారి సంఖ్య 33గా శనివారం తేలింది. 

ఇదే తుది సంఖ్యా, లేక మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రమాద సమయంలో మెస్, హాస్టల్‌ భవనాల్లో కనీసం 40 మందికి పైగా వైద్య విద్యార్థులున్నట్టు కాలేజీ వర్గాలు శనివారం తెలిపాయి. వారికి తోడు పలువురు స్థానికులు కూడా ఉన్నట్టు వెల్లడించాయి. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రికి ఇప్పటిదాకా 270 మృతదేహాలు వచ్చినట్టు బీజే మెడికల్‌ కాలేజీ జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ధవల్‌ గమేతీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులని గురువారమే తేలడం తెలిసిందే. 

అక్కడ టీ స్టాల్‌ నడిపే కుటుంబానికి చెందిన ఆకాశ్‌ పాట్నీ అనే 14 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినట్టు తాజాగా ధ్రువీకరణ అయింది. మిగతా 27 మందిలో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతరులు ఎంతమంది అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదంలో నాలుగు భవనాలు బాగా దెబ్బతిన్నట్టు కాలేజీ డీన్‌ మీనాక్షీ పారిఖ్‌ వెల్లడించారు. ‘‘దర్యాప్తు నిమిత్తం బాయ్స్‌ హాస్టల్‌ భవనాలను ఖాళీ చేయిస్తున్నాం. ఇప్పటికే 200 మంది విద్యార్థులకు పైగా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న, జరగబోయే ఎంబీబీఎస్‌ ఇంటర్నల్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నాం’’అని ప్రకటించారు. హాస్టల్‌ భవనంపై చిక్కిన విమానం తోక భాగం నుంచి శనివారం ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీశారు. అది ఎయిర్‌హోస్టెస్‌దిగా తేల్చారు. 

కొనసాగుతున్న డీఎన్‌ఏ పరీక్షలు 
ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయిపోవడం తెలిసిందే. గుర్తుపట్టే స్థితిలో ఉన్న 8 మృతదేహాలను ఇప్పటికే కుటుంబీకులకు అప్పగించారు. మిగతా వాటికి డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారానికి 11 మృతదేహాలను గుర్తించారు. మృతుల కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు కౌన్సెలర్లను అందుబాటులో ఉంచారు. మరణించిన విమాన ప్రయాణికుల కుటుంబాలకు టాటా గ్రూప్‌ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే. 

బోయింగ్‌ విమానాల్లో భద్రతా తనిఖీలు
ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఆదేశాల మేరకు 26 బోయింగ్‌ 787–8, ఏడు 787–9 సిరీస్‌ విమానాలను భద్రతాపరంగా క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఇప్పటిదాకా 9 విమానాల్లో తనిఖీలు పూర్తయినట్టు వెల్లడించింది. తనిఖీల కారణంగా పలు ఎయిరిండియా విమానాల రాకపోకలు ఆలస్యమవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787–8 విమానానికి వచ్చే డిసెంబర్‌లో సమగ్ర తనిఖీలు జరగాల్సి ఉంది. దాన్ని చివరిసారిగా 2023 జూన్‌లో క్షుణ్నంగా తనిఖీ చేశారు. కుడివైపు ఇంజన్‌ను గత మార్చిలో ఓవరాలింగ్‌ చేశారు.

వీడియో తీసిన టీనేజర్‌ను విచారించిన పోలీసులు 
ఎయిరిండియా విమాన ప్రమాద వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ కావడం తెలిసిందే. ఆర్యన్‌ 17 ఏళ్ల బాలుడు తన మొబైల్‌తో ఆ వీడియో తీశాడు. దర్యాప్తులో భాగంగా సాక్షిగా అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అతని స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. తాను వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టిన 24 సెకన్లలోనే విమానం కూలినట్టు ఆర్యన్‌ మీడియాకు తెలిపాడు. 

‘‘కళ్లముందే జరిగిన ప్రమాదంతో విపరీతంగా భయపడిపోయా. చాలాసేపటిదాకా కనీసం సరిగా మాట్లాడలేకపోయా. వీడియోను మొదట నా సోదరికి చూపించా. తర్వాత మా నాన్నకు చెప్పా. కళ్లు మూసినా, తెరిచినా విమాన ప్రమాదమే గుర్తుకొస్తోంది. మేముండే ఈ ప్రాంతం ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఇక్కడ ఉండాలని లేదు’’అని చెప్పుకొచ్చాడు. ఆర్యన్‌ ఆ రోజంతా ఏమీ తినలేదని, రాత్రంతా నిద్ర కూడా పోలేకపోయాడని అతని తల్లి చెప్పింది. 

రెండుసార్లు వాయిదా వేసుకుని.. రూపానీ మృత్యుప్రయాణం! 
విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ వాస్తవానికి మే 19నే లండన్‌ వెళ్లాల్సింది. అసెంబ్లీ ఉప ఎన్నిక పనుల కారణంగా టికెట్‌ రద్దు చేసుకుని ప్రయాణాన్ని జూన్‌ 5కు వాయిదా వేసుకున్నారు. తర్వాత అదీ రద్దు చేసుకుని జూన్‌ 12న ప్రమాదం బారిన పడిన ఏఐ171లోనే టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అలా విధి ఆయనను మృత్యుముఖానికి నడిపించింది. 2డి నంబర్‌ సీట్‌లో కూచున్న ఆయన ప్రమాదం అనంతరం చెలరేగిన మంటల్లో చిక్కి మరణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement